నాగలాపురంలోని శ్రీ వేదనారాయణ స్వామి వారి ఆలయంలో జూన్ 5వ తేదీన పుష్పయాగ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయం పుష్ప సుగంధాలతో, భక్తిరస వాతావరణంతో ఆధ్యాత్మిక కాంతిని సంతరించుకోనుంది.
ఇందుకోసం జూన్ 4వ తేదీ సాయంత్రం 6.15 గంటల నుండి రాత్రి 7.45 గంటల వరకు పుణ్యాహవచనం, రక్షాబంధనం, మృత్సంగ్రాహణం, సేనాధిపతి ఉత్సవం, పుష్పయాగ అంకురార్పణ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.
జూన్ 5న ఉదయం 11 గంటలకు స్నపన తిరుమంజనం జరగనుండగా, మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5.30 గంటల వరకు భక్తి శ్రద్ధల మధ్య పుష్పయాగం నిర్వహిస్తారు.
ఈ మహోత్సవంలో వివిధ రకాల సుగంధ పుష్పాలు, పవిత్ర పత్రాలతో స్వామివారికి విశేష అభిషేకాలు సమర్పిస్తారు. అనంతరం సాయంత్రం 6.30 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు స్వామివారి వీధి ఉత్సవం భక్తులను అలరించనుంది.
గృహస్తులు ఇద్దరు కలిసి రూ.750/- టికెట్ ద్వారా పుష్పయాగ సేవలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ అధికారులు తెలిపారు.
ఈ ఆలయంలో మే 1 నుండి 9వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. బ్రహ్మోత్సవాలు, నిత్యకైంకర్యాల సందర్భంగా అర్చకులు, పరిచారకులు, అధికారులు, భక్తుల వల్ల తెలియక జరిగిన ఏవైనా లోపాలకు ప్రాయశ్చిత్తంగా ఈ పుష్పయాగ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు అర్చకులు వెల్లడించారు.
No comments:
Post a Comment