23.7.25

హిందూ ధర్మ ప్రచారపరిషత్ నూతన కార్యక్రమాల బ్రోచర్ ను ఆవిష్కరించిన టిటిడి ఛైర్మెన్ Hindu Dharma Prachara Parishat




తిరుమల తిరుపతి దేవస్థానములు, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన కార్యక్రమాల బ్రోచర్ ను టిటిడి ఛైర్మెన్ శ్రీ బీ. ఆర్. నాయుడు ఆవిష్కరించారు. టిటిడి ఈవో శ్రీ జె. శ్యామల రావు, పలువురు టిటిడి బోర్డు సభ్యులతో కలసి మంగళవారం అన్నమయ్య భవన్ లోని సమావేశ మందిరంలో ఛైర్మెన్ ఆవిష్కరించారు.


ఈ సందర్భంగా ఛైర్మెన్ మాట్లాడుతూ, సనాతన ధర్మాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లేందుకు పలు కార్యక్రమాలను రూపొందించామన్నారు. విద్యార్థులకు మానవీయ మరియు నైతిక విలువలపై శిక్షణ ఇచ్చేందుకు సద్గమయ కార్యక్రమాన్ని జూలై 28న ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

అదే విధంగా టిటిడి ఆలయాలలో మహిళల కొరకు గాజులు, పసుపు, కుంకుమ మరియు అక్షింతలు సమర్పించే ప్రత్యేక కార్యక్రమాన్ని సౌభగ్యం పేరుతో ఆగష్టు 08వ తేదీన ప్రారంభిస్తారన్నారు. వీటితో పాటు అక్టోబర్ 02వ తేదీన మన వారసత్వం, ఆగష్టు 15వ తేదీన సన్మార్గం, ఆగష్టు 31న హరికథా వైభవం, అక్టోబర్ 02న అక్షర గోవిందం, డిసెంబర్ 01న భగవద్గీతానుష్టానం - బోధన, 2026 ఏడాది వేసవి సెలవులలో 16 సంవత్సరాల వయసు లోపు పిల్లలకు సంప్రదాయ భజనపై భజే శ్రీనివాసం - సంప్రదాయ భజన శిక్షణ కార్యక్రమాన్ని చేపడుతామన్నారు. వీటితో పాటు వన - నిధి, గిరిజనార్థనం లాంటి కార్యక్రమాలను రూపొందించినట్లు ఛైర్మెన్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ మురళీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment