20.11.25

సిరుల‌త‌ల్లికి వేడుక‌గా స్నపన తిరుమంజనం tirumanjanam










తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడ‌వ‌ రోజైన బుధ‌వారం అమ్మవారికి స్నపన తిరుమంజనం శోభాయమానంగా జరిగింది. మధ్యాహ్నం 12.30 నుండి 2.30 గంటల వరకు ఆలయంలోని శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో ప్రత్యేకంగా ఫల పుష్పాలతో రూపొందించిన మండపంలో పాంచరాత్ర ఆగమశాస్త్రబద్ధంగా ఈ వేడుక వైభవంగా జరిగింది.

ఇందులో ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, నవకలశాభిషేకం, రాజోపచారం నిర్వహించారు. అనంతరం ఛత్ర చామర, వ్యజన దర్పణాది నైవేద్యం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం చేపట్టారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు. శంఖధార, చక్రధార, సహస్రధార, మహాకుంభాభిషేకాలను నిర్వహించారు.
ఏడు ర‌కాల మాల‌లు
ఈ సందర్భంగా తైత్తరీయ ఉపనిషత్తు, పురుషసూక్తం, శ్రీప్రశ్నసంహిత మంత్రాలను అర్చకులు పఠించారు. ఈ వేడుకలో ఒక్కో క్రతువులో ఒక మాల వంతున ఏడు రకాల మాలలను అమ్మవారికి అలంకరించారు. నెమ‌లి ఈక‌ల మాల‌, ద్రాక్ష‌, రోజ్ పెటల్స్, వ‌ట్టివేరు, తులసి, రంగురాళ్ల‌తో కూడిన రోజామాలలు అమ్మవారికి అలంకరించారు.
భక్తులను విశేషంగా ఆకట్టుకున్న పుష్పాలంకరణ
శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలోని ధ్వజమండపం, గర్భాలయం, శ్రీకృష్ణస్వామివారి ఆలయం, శ్రీ సుందరరాజస్వామివారి ఆలయం, వాహనమండపం, ఆస్థానమండపం టీటీడీ గార్డెన్‌ విభాగం ఆధ్వర్యంలో వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. గార్డ‌న్ డెప్యూటీ డైరెక్ట‌ర్ శ్రీ శ్రీ‌నివాసులు ఆధ్వ‌ర్యంలో దాదాపు 80 మంది సిబ్బంది మూడు రోజుల పాటు శ్రమించి సుందరంగా అలంకరించారు.
ఈ కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment