టిటిడి
ఆధ్వర్యంలో నడుస్తున్న ఆలయాలను అత్యంత ఆధునాతన ఆధ్యాత్మిక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సూచించారు. శనివారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో ఆయన సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, తిరుమలలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తుగా గుర్తించి వెంటనే పరిష్కారం చూపే విధంగా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సూచించారు. భక్తులు క్యూలైన్లలోకి ప్రవేశించిన సమయం నుంచి శ్రీవారి దర్శనం పూర్తి చేసి తిరుగు ప్రయాణం అయ్యే వరకు వారికి అందుతున్న సౌకర్యాలను కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పర్యవేక్షించాలని చెప్పారు.
తిరుమల పవిత్రతకు భంగం కలిగించే చర్యలను అరికట్టేందుకు అత్యాధునిక సీసీ కెమెరాలు, ఫేసియల్ రికగ్నిషన్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఇప్పటికే ఈ వ్యవస్థను ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నట్లు అధికారులు వివరించారు.
తిరుమలలో భవిష్యత్తులో కాలుష్యానికి తావు లేకుండా చర్యలు తీసుకోవాలని, మరిన్ని ఆలయాల నిర్మాణం ద్వారా భక్తి భావాన్ని పెంపొందించేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని సీఎం పేర్కొన్నారు. అన్నదానం, ప్రాణదానం పథకాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని, ప్రాణదానం సేవలను విస్తరించి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.
శ్రీవారి సేవలో పాల్గొనే సేవకులకు వారి నైపుణ్యానికి తగ్గట్లుగా శిక్షణ ఇచ్చి, వారి సేవలను టిటిడి పరిధిలోని అన్ని ఆలయాల్లో వినియోగించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
అదేవిధంగా, టిటిడిలో అమలు చేస్తున్న విధానాలు దేశంలోని ఇతర ఆలయాలకు
మరింత మార్గదర్శకాలుగా నిలిచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ద్వారా క్యూలైన్ మేనేజ్మెంట్ విధానాన్ని అమలు చేయాలని కోరారు.
అంతకుముందు కమాండ్ కంట్రోల్ సెంటర్ సేవలపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా భక్తుల రద్దీని ముందుగానే అంచనా వేసి, వనరులను సమర్థవంతంగా వినియోగించే విధంగా చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు. లడ్డూల తయారీ, విక్రయాలు, నిల్వ వంటి అంశాలను కూడా సమగ్రంగా పర్యవేక్షిస్తున్నామని చెప్పారు.
పలువురు ఎన్ ఆర్ ఐ దాతల సహకారంతో కార్యా ఫౌండేషన్ ద్వారా కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా అందిస్తున్న సేవలను అమెరికాలోని దాత శ్రీ వేజేండ్ల జయప్రసాద్ వర్చువల్ ద్వారా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుకు వివరించారు.
ఈ కార్యక్రమంలో ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, ముఖ్యమంత్రి కార్యదర్శి శ్రీ ప్రద్యుమ్న, అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి, ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, సివిఎస్వో శ్రీ కె. వి మురళీ కృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment