తిరుమల
శ్రీవారి సేవ చేసే అవకాశం రావడం ఎంతో అదృష్టమని టిటిడి ఈవో శ్రీ ఎం. రవిచంద్ర అన్నారు. తిరుపతి పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో సోమవారం జాతీయ పౌర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవోలు శ్రీ వి. వీరబ్రహ్మం, డా. ఎ. శరత్, సివిఎస్వో శ్రీ కె.వి. మురళీకృష్ణ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, భక్తులకు ఆధ్యాత్మిక భావంతో పాటు సమిష్టి భావనతో ఉత్తమ సేవలు అందించాలని సూచించారు. జాతీయ పౌర దినోత్సవం కేవలం సివిల్ సర్వీసెస్ ఉద్యోగులకే కాకుండా ప్రతి ఒక్కరికీ సంబంధించినదని తెలిపారు. అందరూ స్వయం అనుభూతితో పనిచేయాలని సూచించారు. ప్రభుత్వం ప్రజల మధ్య ఉద్యోగులు వారధిలా ఉంటారని చెప్పారు.
చట్ట పరిపాలన సూత్రాలను పాటిస్తూ విధులు నిర్వహించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తమ స్థాయిలో బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తే మంచి ఫలితాలు సాధ్యమవుతాయని చెప్పారు. పరస్పర సహకారంతో, సమూహంగా పనిచేస్తేనే మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు.
అలాగే, అందరికీ అర్థమయ్యే భాషలో మాట్లాడితే విషయాన్ని సులభంగా అర్థం చేసుకోవచ్చని, వీలైనంత వరకు తెలుగులోనే భావ వ్యక్తీకరణ చేయాలని సూచించారు. టిటిడిలో మొదటిసారి జాతీయ పౌర దినోత్సవాన్ని ఉద్యోగుల మధ్య నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు.
ఈ సందర్భంగా అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ, క్షేత్ర స్థాయి అనుభవాలను వినియోగించుకుంటూ వ్యవస్థలను బలోపేతం చేయాలని సూచించారు.
టిటిడిలో అభిప్రాయాల సేకరణ విధానం ద్వారా భక్తులకు మెరుగైన సేవలు అందిస్తున్నామని తెలిపారు.
నిరంతరం శిక్షణ అవసరమని, మంచి ఫలితాల కోసం జ్ఞానం తో పాటు అనుభవం కూడా అవసరమని అన్నారు. ఉద్యోగులు ఎప్పటికప్పుడు తమను తాము మెరుగుపరుచుకుంటూ నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి సీఈ శ్రీ టి.వి. సత్యనారాయణ, డిప్యూటీ ఈవోలు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల అధిపతులు మరియు ఉద్యోగులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment