21.5.26

శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల పోస్టర్లు, కరపత్రాల ఆవిష్కరణ brahmotsavams





నారాయణవనంలోని శ్రీ పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్లు, కరపత్రాలను టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర బుధవారం తిరుపతిలోని ఈవో నివాస గృహంలోని కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించి పలు కీలక సూచనలు చేశారు.

భక్తులకు దివ్యానుభూతి కలిగేలా ఏర్పాట్లు : టీటీడీ ఈవో

ఈ సందర్భంగా టీటీడీ ఈవో మాట్లాడుతూ మే 28 నుండి జూన్ 5 వరకు నారాయణవనంలో శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగనున్నాయని తెలిపారు. మే 24న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, మే 27న అంకురార్పణం, జూన్ 4న దివ్య కల్యాణోత్సవం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

బ్రహ్మోత్సవాలకు సాంప్రదాయం, సంస్కృతి, ఆధ్యాత్మిక సమ్మేళనంగా ఏర్పాట్లు చేపట్టాలని, భక్తులకు సౌకర్యవంతంగా ఏర్పాట్లు చేపట్టేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. వేసవి నేపథ్యంలో త్రాగునీరు, అన్నప్రసాదాల పంపిణీ, చలువ పందిళ్లు, వైట్ పెయింటింగ్, ఆలయ పరిసరాల్లో ఆహ్లాదకర రంగోలీలు, విద్యుత్ దీపాలంకరణలు, పుష్పాలంకరణలు, సాంప్రదాయ పెయింటింగ్స్‌, సాంస్కృతిక కార్యక్రమాలు తదితర ఏర్పాట్లు విస్తృతంగా చేపట్టాలని సూచించార.

వాహన సేవలు

బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజు ఉదయం 7.30 నుండి 9.30 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు స్వామివారు, అమ్మవారు వివిధ దివ్య వాహనాలపై విహరించి భక్తులకు అనుగ్రహ దర్శనం ఇవ్వనున్నారు.

మే 28 – ధ్వజారోహణం, పెద్దశేష వాహనం

మే 29 – చిన్నశేష వాహనం, హంస వాహనం

మే 30 – సింహ వాహనం, ముత్యపుపందిరి వాహనం

మే 31 – కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం

జూన్ 1 – మోహినీ అవతారం, గరుడ వాహనం

జూన్ 2 – హనుమంత వాహనం, గజ వాహనం

జూన్ 3 – సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం

జూన్ 4 – రథోత్సవం, అశ్వవాహనం, కల్యాణోత్సవం

జూన్ 5 – చక్రస్నానం, ధ్వజావరోహణం

జూన్ 4న వైభవంగా శ్రీ స్వామివారి కల్యాణోత్సవం

జూన్ 4వ తేదీ రాత్రి 8.30 గంటలకు నిర్వహించే శ్రీ స్వామివారి కల్యాణోత్సవానికి పటిష్ట ఏర్పాట్లు చేపట్టాలని టీటీడీ ఈవో అధికారులను ఆదేశించారు. కల్యాణోత్సవానికి విచ్చేసే భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం, ప్రసాదాల పంపిణీ, కూర్చునే ఏర్పాట్లు, భద్రతా చర్యలు సమగ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ఆలయాల డిప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, ఆలయ అర్చకులు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ నాగరాజు తదితర అధికారులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment