2.7.26

సూర్యప్రభ వాహనంపై మత్స్యావతార వేదనారాయణ స్వామి అలంకారంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి surya prabha vahanam






అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన బుధవారం ఉదయం సూర్యప్రభ వాహనంపై మత్స్యావతార వేదనారాయణ స్వామి అలంకారంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారు దివ్యమంగళ స్వరూపంతో భక్తులకు కటాక్షించి అభయాన్ని ప్రసాదించారు. గోవింద నామస్మరణల మధ్య జరిగిన వాహనసేవ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.

సూర్యప్రభ వాహన సేవతో ఆయురారోగ్యాలుఐశ్వర్య ప్రాప్తి

సకల జీవరాశికి చైతన్యాన్ని ప్రసాదించే సూర్యనారాయణుని మహిమను ప్రతిబింబించే సూర్యప్రభ వాహనంపై శ్రీహరి దర్శనం అత్యంత పుణ్యప్రదమైనదిగా భావిస్తారు. ఈ వాహనసేవను దర్శించిన భక్తులకు ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, సత్సంతాన భాగ్యం, సకల శుభాలు సిద్ధిస్తాయని ఆగమశాస్త్రాలు పేర్కొంటున్నాయి.

నేడు రాత్రి చంద్రప్రభ వాహన సేవ

బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై స్వామివారు ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులకు దివ్య దర్శనం ఇవ్వనున్నారు.

జూలై 2 వైభవంగా రథోత్సవం

బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన గురువారం (జూలై 2) ఉదయం 8 గంటలకు శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి రథోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఉదయం 8.45 గంటల నుండి 10.15 గంటల వరకు ఆలయ నాలుగు మాడవీధుల్లో రథంపై విహరించి భక్తులను అనుగ్రహిస్తారు. అదే రోజు రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు అశ్వవాహన సేవ జరుగుతుంది.

ఈ వాహనసేవలో ఆలయ ఏఈఓ శ్రీ దేవరాజులు, సూపరింటెండెంట్ శ్రీమతి శ్రీవాణి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ వేణుగోపాల్, కంకణ భట్టర్ శ్రీ సూర్యకుమార్ ఆచార్యులు, శ్రీవారి సేవకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment