శ్రీవారి
దర్శనార్థం లక్షలాది భక్తులకు నిత్యం విశేష సేవలు అందిస్తున్న టిటిడి ఉద్యోగులు ఎదుర్కొనే మానసిక మరియు పనిఒత్తిడులను క్రీడల ద్వారా సమర్థంగా అధిగమించవచ్చని టిటిడి అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. టిటిడి ఉద్యోగుల వార్షిక క్రీడాపోటీలు సోమవారం తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలోని పరేడ్ మైదానంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అదనపు ఈవో, ఉద్యోగులతో క్రీడా ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం పలువురు ఉన్నతాధికారులతో కలిసి క్రీడా పతాకాన్ని ఆవిష్కరించి, బెలూన్లు మరియు శాంతి కపోతాలను ఎగురవేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టిటిడి ఉద్యోగులు రోజువారీ జీవితంలో ఏదో ఒక క్రీడను అలవాటు చేసుకుంటే ఒత్తిళ్లను అధిగమించడంతో పాటు మరింత ఉత్సాహంతో, బాధ్యతతో విధులు నిర్వర్తించగలరని తెలిపారు. క్రీడలు జీవితం యొక్క భాగమైతే శారీరక ఆరోగ్యంతో పాటు ఉల్లాసం, సమయపాలన, ప్రణాళికా దృక్పథం, సానుకూల ఆలోచన, మంచి ప్రవర్తన, క్రమశిక్షణ, కార్యనిర్వహణ నైపుణ్యం, నాయకత్వ లక్షణాలు, సంక్షోభ నిర్వహణ సామర్థ్యం మరియు అందరిని కలుపుకుని ముందుకు సాగే తత్వం అలవడతాయని చెప్పారు.
మన ఆలోచనలకు అనుగుణంగానే మన ప్రవర్తన ఉంటుందని తెలిపారు. ఉద్యోగుల సంక్షేమం, మానసిక వికాసం దృష్ట్యా 1977 సంవత్సరం నుంచి ప్రతి ఏడాది ఉద్యోగుల క్రీడాపోటీలను నిర్వహిస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. ప్రతి ఉద్యోగి రోజూ క్రీడల్లో పాల్గొనాలని సూచించారు.
అదనపు ఈవో వాలీబాల్ మ్యాచ్తో క్రీడాపోటీలను ప్రారంభించారు. పురుషులు, మహిళలకు వేర్వేరుగా పోటీలు నిర్వహించడంతో పాటు ప్రత్యేక ప్రతిభావంతులు, సీనియర్ అధికారులు, రిటైర్డ్ ఉద్యోగుల కోసం ప్రత్యేక విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నారు. ఈ క్రీడల్లో టగ్ ఆఫ్ వార్, చెస్, వాలీబాల్, క్యారమ్స్, బాల్ బ్యాడ్మింటన్, ఫుట్బాల్, టేబుల్ టెన్నిస్, క్రికెట్, షటిల్, టెన్నిస్ తదితర అంశాలు ఉన్నాయి.
కార్యక్రమానికి వ్యాఖ్యాతగా పీఆర్వో కుమారి నీలిమ వ్యవహరించారు.
ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీ ఎ. ఆనంద రాజు, డిప్యూటీ ఈవోలు శ్రీమతి వి.ఆర్. శాంతి, శ్రీ సెల్వం, శ్రీ రాజేంద్ర కుమార్, సీపీఆర్వో డా. టి. రవి, గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాస్, ఇతర ఉన్నతాధికారులు మరియు పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment