నాగలాపురంలోని శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయంలో మే 1 నుండి 9వ తేదీ వరకు నిర్వహించనున్న వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్లు, బుక్లెట్ను టీటీడీ ఈవో శ్రీ ఎం. రవిచంద్ర ఆదివారం తిరుపతిలోని ఈవో బంగ్లాలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, బ్రహ్మోత్సవాలకు టీటీడీలోని అన్ని విభాగాలు సమన్వయంగా ఏర్పాట్లు పూర్తి చేయాలని తెలిపారు. వేసవి తీవ్రత దృష్ట్యా భక్తుల సౌకర్యార్థం ఆలయ పరిసరాల్లో చలువ పందిళ్లు, మాడవీధుల్లో కూల్ పెయింట్, తాగునీటి సదుపాయాలు, ఎప్పటికప్పుడు నీటి పిచికారీ ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు.
భక్తులను ఆకట్టుకునేలా విద్యుత్ దీపాలంకరణలు, పుష్పాలంకరణలు, క్యూలైన్లు, ఫ్లెక్సీలు, ఆర్చీలు ఏర్పాటు చేయాలన్నారు.
ప్రతిరోజు వాహన సేవల సందర్భంగా భజనలు, కోలాటాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టాలన్నారు.
అదనంగా మొబైల్ మరుగుదొడ్లు, పారిశుద్ధ్య కార్మికులు, ప్రథమ చికిత్స కేంద్రాలు, అంబులెన్సులు, అగ్నిమాపక సిబ్బంది, వాహన పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేపట్టాలని సూచించారు.
భక్తులు పెద్ద సంఖ్యలో బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారి కటాక్షానికి పాత్రులు కావాలని ఈవో కోరారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, ఇతర అధికారులు పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాలలో వాహన సేవల వివరాలు :
మే 1 – ధ్వజారోహణం, పెద్దశేష వాహనం
మే 2 – చిన్నశేష వాహనం, హంస వాహనం
మే 3 – సింహ వాహనం, ముత్యపు పందిరి వాహనం
మే 4 – కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం
మే 5 – మోహినీ అవతారం, గరుడ వాహనం
మే 6 – హనుమంత వాహనం, గజ వాహనం
మే 7 – సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం
మే 8 – రథోత్సవం, ఆర్జిత కల్యాణోత్సవం, అశ్వవాహనం
మే 9 – చక్రస్నానం, ధ్వజావరోహణం
ప్రతిరోజు వాహన సేవలు ఉదయం 8 నుండి 9.30 గంటల వరకు, రాత్రి 7.30 నుండి 9 గంటల వరకు నిర్వహిస్తారు.
ఆర్జిత కల్యాణోత్సవం
మే 8వ తేదీ సాయంత్రం 4.30 నుండి 6.30 గంటల వరకు స్వామివారి ఆర్జిత కల్యాణోత్సవం వైభవంగా జరుగనుంది. రూ.750/- చెల్లించి ఇద్దరు గృహస్తులు పాల్గొనవచ్చు. పాల్గొనే వారికి ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ, ఒక వడ బహుమానంగా అందజేస్తారు.
No comments:
Post a Comment