చిత్తూరు
జిల్లా కీలపట్లలోని శ్రీ కోనేటిరాయస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం ఉదయం ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9.05 నుండి 9.15 గంటల మధ్య మిథున లగ్నంలో ధ్వజారోహణం నిర్వహించి, సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు.
గరుత్మంతుని చిత్రంతో అలంకరించిన ధ్వజపటానికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం వేదమంత్రోచ్చారణల మధ్య గరుత్మంతుని ప్రతిరూపాన్ని కొత్త వస్త్రంపై లిఖించి, పూజలు చేసి, ధ్వజస్తంభంపై ప్రతిష్ఠించారు. ముందుగా గ్రామ పోలిమేరలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించడం జరిగింది.
ఈ రోజు రాత్రి 7 గంటలకు శేషవాహనంపై స్వామివారు ఊరేగి భక్తులకు దర్శనమివ్వనున్నారు.
ఆలయ ప్రాముఖ్యత
కీలపట్ల శ్రీ కోనేటిరాయస్వామివారి ఆలయం ప్రముఖ పుణ్యక్షేత్రంగా భక్తుల ఆదరణ పొందుతోంది. స్థలపురాణం ప్రకారం బృగు మహర్షి స్వామివారిని సాలగ్రామ రూపంలో ప్రతిష్ఠించినట్లు చెబుతారు. ఈ ఆలయంలోని స్వామివారి విగ్రహం తిరుమల శ్రీవారి మూలవిరాట్ను పోలి ఉండటం విశేషం. భక్తులు స్వామివారిని దర్శించుకుంటే కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. తాళ్లపాక అన్నమాచార్యులు ఈ క్షేత్రాన్ని దర్శించి సంకీర్తనలు ఆలపించినట్లు చారిత్రకంగా పేర్కొంటారు.
2012 నవంబర్ 19న ఈ ఆలయం టిటిడిలో విలీనం అయిన తరువాత నిత్యకైంకర్యాలు, ఉత్సవాలు మరింత వైభవంగా నిర్వహిస్తున్నారు. ప్రతి రోజూ పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. ప్రతి శనివారం సుమారు 200 మంది భక్తులు తలనీలాలు సమర్పిస్తున్నారు. భక్తులకు నిత్యం అన్నప్రసాదాలు అందిస్తున్నారు.
ప్రతి నెల శ్రవణ నక్షత్రం రోజున కళ్యాణోత్సవం నిర్వహిస్తారు. గృహస్థులు రూ.300 చెల్లించి ఈ సేవలో పాల్గొనవచ్చు. పౌర్ణమి పర్వదినాన ఊంజల్ సేవ కూడా భక్తి భావంతో నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో టిటిడి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మీ, కంకణ బట్టార్ శ్రీ శ్రీకాంత్ ఆచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ మోహన రమణ, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment