తిరుపతిలోని
శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఆగస్టు 8 నుండి 10వ తేదీ వరకు వైభవంగా జరగనున్న వార్షిక పవిత్రోత్సవాలకు శుక్రవారం సాయంత్రం వేద మంత్రోచ్ఛారణల నడుమ శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు.ఈ సందర్భంగా సాయంత్రం 6 గంటల నుంచి సేనాధిపతి ఉత్సవం, మేధిని పూజ, మృత్సంగ్రహణం, అంకురార్పణ ఘట్టాలను ఆగమోక్తంగా నిర్వహించి, పవిత్రోత్సవాలకు శ్రీకారం చుట్టారు.
ఆలయానికి విచ్చేసే భక్తులు, ఆలయ సిబ్బంది వల్ల తెలియక జరిగే చిన్నచిన్న దోషాల కారణంగా ఆలయ పవిత్రతకు ఎలాంటి విఘాతం కలగకుండా, వాటికి ప్రాయశ్చిత్తంగా ప్రతి సంవత్సరం మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ.
పవిత్రోత్సవాల్లో భాగంగా ఆగస్టు 8న యాగశాలలో పవిత్ర ప్రతిష్ఠ, శయనాధివాసం, ఆగస్టు 9న పవిత్ర సమర్పణ, వైదిక కార్యక్రమాలు, ఆగస్టు 10న యాగశాలలో వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ఘనంగా ముగియనున్నాయి.
ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈవో డా. ఎ. శరత్, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి బి. నాగరత్న, సూపరింటెండెంట్ శ్రీ కె. శ్రీనివాసులురెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ ఆనంద్కుమార్ దీక్షితులు, టెంపుల్ ఇన్స్పెక్టర్లు శ్రీ సురేష్బాబు, శ్రీ హరికృష్ణ, ఆలయ అర్చకులు, శ్రీవారి సేవకులు, భక్తులు పాల్గొన్నారు.
No comments :
Write comments