22.6.25

మానసికంగా, శారీరకంగా నియంత్రణలో ఉండడం యోగాతోనే సాధ్యం : టిటిడి అడిషనల్ ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి















మానవ సమాజంలో ప్రతి ఒక్కరూ మానసికంగా, శారీరకంగా నియంత్రణలో ఉండడం యోగాతోనే సాధ్యమని టిటిడి అడిషనల్ ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి వెల్లడించారు. టిటిడి పరిపాలనా భవనం వెనుక ఉన్న పరేడ్ మైదానంలో శనివారం యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. 

ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ, విశ్వవ్యాప్తంగా 190 దేశాల్లో యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారని మాట్లాడారు. నవీన సమాజంలో ప్రపంచవ్యాప్తంగా యోగా ప్రాధాన్యత పెరుగుతోందన్నారు. యోగాతో ఆధ్యాత్మికత, మానసిక ఒత్తిళ్లు, శారీరకంగా తదితర అంశాలను నియంత్రణలో ఉండవచ్చని, తద్వారా ఉన్నతంగా ఎదగడానికి అవకాశం ఉంటుందన్నారు. అంతర్గతంగా మనం సమాజంలో ఎలా ఉండాలో, జ్ఞాన వంతంగా, ఉన్నతంగా సమాజంలో ఉండేందుకు యోగా అంతర్గత పాఠాలు నేర్పుతుందని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ యోగాను చేయడం దిన చర్యగా పాటించాలని ఆయన సూచించారు. యోగా దినోత్సవంలో టిటిడి ఉద్యోగులు, సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పాల్గొనడం సంతోషకరమన్నారు. 
విశాఖలో జరుగుతున్న యోగా దినోత్సవం గిన్నిస్ బుక్ రికార్డులో నమోదు కావడం గర్వించదగ్గ విషయమన్నారు. ప్రపంచ వ్యాప్తంగా యోగా ప్రాధాన్యతమరింత పెంచేలా ప్రధానమంత్రి మాన్యశ్రీ నరేంద్ర మోదీ, సిఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు విశాఖలో యోగా దినోత్సవం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. 
ముందుగా పరేడ్ మైదానంలో స్వామి వారికి దీపారాధన,  జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం యోగా నిపుణులు చేసిన ఆసనాలను క్రమ పద్ధతిలో టిటిడి అధికారులు, సిబ్బంది, విద్యార్థులు చేశారు. యోగాసనాలు చేసేందుకు వీలుగా 4 ఎల్ ఈ డీ స్క్రీన్ లను , యోగా మ్యాట్ లను, త్రాగునీరు, కార్పేట్లు, అల్పాహారం, టీ షర్ట్ లను టిటిడి ఏర్పాటు చేసింది. 
ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు శ్రీమతి పనబాక లక్ష్మి, శ్రీ జి. భాను ప్రకాష్ రెడ్డి, జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ మురళీ కృష్ణ, పలువురు అధికారులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

No comments :
Write comments