తిరుమల శ్రీవారి దర్శనార్థం శ్రీవారి మెట్టువద్ద నుండి కాలినడకన వెళ్లే దివ్యదర్శనం టోకెన్ల జారీ కౌంటర్లను తాత్కాలికంగా శుక్రవారం సాయంత్రం నుండి అలిపిరి భూదేవి కాంప్లెక్స్ కి మార్చాలని టిటిడి నిర్ణయించింది. ఈ అంశానికి సంబంధించి టిటిడి ఈవో శ్రీ జె. శ్యామలరావు మంగళవారం వర్చువల్ మీటింగ్ ద్వారా టిటిడి అధికారులతో చర్చించారు.
శ్రీవారి మెట్టు నుండి కాలినడకన వెళ్లే దివ్య దర్శనం భక్తులకు టోకెన్ల జారీ కోసం భూదేవి కాంప్లెక్స్లో తాత్కాలిక ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని అధికారులను టిటిడి ఈవో శ్రీ జె. శ్యామల రావు అధికారులను ఆదేశించారు. ఈ నెల 6వ తేదీ శుక్రవారం సాయంత్రం నుండి టోకెన్లు తీసుకునే దివ్యదర్శనం భక్తులు తదుపరి శ్రీవారి మెట్టు వద్ద నుండి తిరుమలకు కాలినడకన శనివారం శ్రీవారిని దర్శించుకునేలా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. శుక్రవారం నుండి ఏ రోజు కారోజు భూదేవి కాంప్లెక్స్ లో దివ్యదర్శనం భక్తులు టోకెన్లు తీసుకుని మరుసటి రోజు శ్రీవారిని దర్శించుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్ల జారీ కోసం ప్రత్యేకంగా 4 కౌంటర్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
దివ్య దర్శనం టోకెన్ల కోటా లభ్యత ప్రకారం ముందుగా వచ్చిన వారికి ముందుగా ప్రాతిపదికన ఆధార్ కార్డులతో టోకెన్లు పొందాల్సి ఉంటుంది. శ్రీవారి మెట్టు 1200వ మెట్టు వద్ద దివ్య దర్శనం టోకెన్లను స్కాన్ చేసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. భక్తుల రద్దీ నేపథ్యంలో భద్రత, ట్రాఫిక్ సమస్యలు ఇబ్బందులు తలెత్తకుండా టిటిడి విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ, జిల్లా పోలీసులు సమన్వయంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఈవో ఆదేశించారు.
అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద టిటిడి సీనియర్ అధికారులు నిరంతర తనిఖీలు చేపట్టాలని, టోకెన్ల జారీలో ఎలాంటి ఉద్రిక్తతలకు అవకాశం ఇవ్వకుండా ప్రణాళికా బద్ధంగా ఏర్పాట్లు చేయాలని కోరారు. శ్రీవారి మెట్టు వద్ద నుండి అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్దకు టోకెన్ల జారీని మార్చే అంశంపై విస్తృతంగా ప్రచారం చేపట్టాలన్నారు. భక్తుల సౌకర్యార్థం పటిష్ట క్యూలైన్లను ఏర్పాటు చేయాలన్నారు. భక్తులకు అన్నప్రసాదాలు, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. శాఖల వారీగా శ్రీవారి సేవకులను వినియోగించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, తిరుపతి జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం, టీటీడీ ఇన్చార్జి సీవీఅండ్ఎస్వో, తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ హర్షవర్ధన్రాజు, సీఈ శ్రీ టి.వి. సత్యనారాయణ, ఎస్ఈలు శ్రీ మనోహరం, శ్రీ వెంకటేశ్వరులు, జీఎం(ఐటీ అండ్ ట్రాన్స్పోర్ట్) శ్రీ శేషారెడ్డి, డిప్యూటీ ఈవోలు శ్రీ లోకనాథం, శ్రీ సెల్వం, శ్రీ గోవింద రాజన్ ,శ్రీ సోమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.
.jpg)
No comments :
Write comments