29.7.25

ఆగ‌స్టు 8న వరలక్ష్మీ వ్రతానికి విస్తృత ఏర్పాట్లు : టీటీడీ జేఈవో శ్రీ వి. వీర‌బ్ర‌హ్మం Varalakshmi Vratam







తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 8న నిర్వహించనున్న వరలక్ష్మీ వ్రతానికి భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నట్టు  టీటీడీ  జేఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం తెలిపారు. తిరుచానూరులోని ఆస్థానమండపంలో సోమ‌వారం జేఈవో వరలక్ష్మీ వ్రతం ఏర్పాట్లపై శాఖల వారీగా అధికారులతో సమీక్ష నిర్వహించారు.


ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ, వరలక్ష్మీ వ్రతం సందర్భంగా తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడికి కుంకుమ, గాజులు, ప్రసాదాలు పంపిణీ చేయాలని అధికారులకు సూచించారు. ఆగస్టు 8వ తేదీ శుక్రవారం ఉదయం 10 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంటల వరకు ఆస్థానమండపంలో వరలక్ష్మీ వ్రతంను శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు స్వర్ణరథంపై శ్రీ పద్మావతి అమ్మవారు నాలుగు మాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనమివ్వనున్నట్లు చెప్పారు. వరలక్ష్మీ వ్రతంలో భక్తులు(ఇద్దరు) రూ.1000/- చెల్లించి పాల్గొనవచ్చన్నారు. ఈ కారణంగా అభిషేకం, అభిషేకానంతర దర్శనం, లక్ష్మీపూజ, కల్యాణోత్సవం, బ్రేక్ ద‌ర్శ‌నం, ఊంజల్‌సేవలను టీటీడీ రద్దు చేసినట్లు తెలిపారు.

గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మహిళా భక్తులు అధికంగా వచ్చే అవకాశం ఉండడంతో మరింత మెరుగ్గా ఏర్పాట్లు చేయాలని జేఈవో అధికారులకు సూచించారు. వరలక్ష్మీ వ్రతాన్ని భక్తులు తిలకించేందుకు వీలుగా ఎల్‌ఇడి స్క్రీన్లు ఏర్పాటుచేయాలని, భక్తులకు తాగునీరు, అన్నప్రసాదాలు విరివిగా పంపిణీ చేయాలని ఆదేశించారు. భక్తులకు పంపిణీ చేసేందుకు కుంకుమ ప్యాకెట్లు, కంకణాలు, గాజులు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ఆకట్టుకునేలా భజన బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. అమ్మవారి ఆలయం, ఆస్థాన మండపం, ఇతర ప్రాంతాల్లో మరింత ఆకర్షిణీయంగా, ఆకట్టుకునేలా పుష్పాలంకరణ, విద్యుద్దీపాలంకరణ చేపట్టాలని సూచించారు. స్థానిక పంచాయతీ అధికారులతో సమన్వయం చేసుకుని ఆలయ పరిసర రహదారులు, సమీప ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ట్రాఫిక్, సెక్యూరిటీ  సమస్యలు తలెత్తకుండా పోలీసులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.

వరలక్ష్మీ వ్రతాన్ని ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారాలు అందించేందుకు వీలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆస్థానమండపంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లు, ఆలయ పరిసరాలలో పెండాల్స్, సూచిక బోర్డులు, ఎల్.ఈ.డీ స్క్రీన్ లు  ఏర్పాటు చేయాలన్నారు.  అవసరమైన శ్రీవారి సేవకులు, పారిశుద్ధ్య కార్మికులు, సెక్యూరిటీ గార్డులను సమకూర్చుకోవాలన్నారు. అమ్మవారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసే అవకాశం ఉండడంతో ముందస్తుగా ఏర్పాట్లు చేపట్టాలన్నారు.

పురాణ ప్రాశస్త్యం :

పూర్వం శంకరుడు పార్వతిదేవికి ఈ వరలక్ష్మీ వ్రతం విశిష్ఠత, అచరించవలసిన విధానాన్ని తెలియచేసినట్లు స్కంద, భవిష్యోత్తర పురాణాల ద్వారా తెలుస్తుంది. కావున సాక్షత్తు శ్రీ మహాలక్ష్మీ అవతరించిన దివ్యస్థలం తిరుచానూరు. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం ఆచరించడం ఆనవాయితీ. శ్రవణ మాసంలో ఈ వ్రతం చేసిన మహిళలకు సత్సంతానం, దీర్ఘమాంగల్యసౌఖ్యం, సిరిసంపదలు, ఆరోగ్యం, కుటుంబసౌఖ్యం వంటి ఎన్నో మహాఫలాలు కలుగుతాయని పురాణాల ద్వారా తెలుస్తుందని అర్చకులు తెలిపారు.    

ఈ కార్యక్రమంలో అర్చకులు శ్రీ శ్రీనివాస చార్యులు, శ్రీ బాబు స్వామి, శ్రీ మణికంఠ స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ పి. హరింద్రనాథ్, ఎస్.ఈ (ఎలక్ట్రికల్) శ్రీ వేంకటేశ్వర్లు, అన్నదానం డిప్యూటీ ఈవో శ్రీ సెల్వం, విజీవో శ్రీ సురేంద్ర ఇతర అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments