31.7.25

శ్రీ కశ్యప మహర్షి జ్ఞానకాండ గ్రంథం వైఖ‌న‌స ఆరాధ‌న‌ల‌కు ప్రామాణికం – శ్రీ కశ్యప మహర్షి జయంతి స‌భ‌లో పండితుల ఉద్ఘాట‌న‌






శ్రీ కశ్యప మహర్షి వారు అందించిన జ్ఞానకాండ గ్రంథం అసంఖ్యక వైఖనస ఆలయాలలో నిర్వహించే ఆరాధనలకు అత్యంత ప్రామాణికమ‌ని పండితులు పేర్కొన్నారు. తిరుమల ఆస్థాన మండపంలో శ్రీ వైఖానస దివ్య సిద్ధాంత వివర్ధిని సభ మరియు టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో బుధవారం శ్రీ వైఖానస మహర్షి శిష్యుల‌లో ఒక‌రైన శ్రీ క‌శ్య‌ప‌ మహర్షి తిరు నక్షత్రోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.


ఈ సంద‌ర్భంగా పండితులు ప్ర‌సంగిస్తూ శ్రీ కశ్యప మహర్షి వారు అందించిన జ్ఞానకాండ గ్రంథం ఆలయ నిర్మాణానికి, భూ పరీక్ష, శంఖు స్థాపన, ఆలయ నిర్మాణ శైలి, మండ‌ప‌ నిర్మాణం, విగ్రహ నిర్మాణం, ప్రతిష్టా విధానాలు వంటి సమగ్రమైన జ్ఞానం సమాజానికి అందించింద‌ని తెలిపారు.

సాకార, నిరాకార ఆరాధన విశేషాలను, విష్ణు పూజా మహిమను, పంచభూతాలైన భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశాలు ప్రశాంతంగా ఏవిధమైన వ్యత్యాసాలు లేకుండా లోకానికి  అనుగ్రహం  అందించే అద్భుత శాంతి విధానాలను సమగ్రంగా జ్ఞానకాండ గ్రంథంలో శ్రీ కశ్యప మహర్షి వారు వివరించారని తెలియ‌జేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో శ్రీ వైఖానస సభ కార్యదర్శి శ్రీ శ్రీనివాస దీక్షితులు, శ్రీ విఖనస ట్రస్టు కార్యదర్శి శ్రీ ప్రభాకరాచార్యులు,  శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం పండితులు శ్రీ శ్రీ‌నివాస దీక్షితులు, టీటీడీ పురాణ పండితులు శ్రీ వాకాణి రామ‌కృష్ణ శేష‌సాయి, ధర్మగిరి వేదవిజ్ఞాన పీఠం అధ్యాపకులు, విద్యార్థులు, ఇతర పండితులు పాల్గొన్నారు.

No comments :
Write comments