3.7.25

క‌న్నుల‌పండుగ‌గా పుష్పయాగం Pushpa Yagam







తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో బుధవారం పుష్పయాగ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా ఉదయం 9.30 - 11.30 గం.ల మధ్య శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామి వారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు. అనంతరం  మధ్యాహ్నం 1 నుండి సాయంత్రం 4 గంటల వరకు అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ పుష్పయాగం వైభవంగా జరిగింది.


గత  బ్ర‌హ్మోత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకులు, అధికార, అనధికారులు, భక్తుల వల్ల తెలిసీ తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో తులసి, చామంతి, గన్నేరు, మొగలి, సంపంగి, రోజా, కలువలు వంటి 12 రకాల సాంప్రదాయ పుష్పాలు, తుల‌సి, మ‌రువం, ద‌మ‌నం, బిల్వం, ప‌న్నీరాకు వంటి 6 రకాల పత్రాలు కలిపి మొత్తం 3 టన్నుల పుష్పాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారికి పుష్పయాగం నిర్వహించారు. ఈ పుష్పాలను ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి దాతలు విరాళంగా అందించారు. సాయంత్రం 6 గంటలకు స్వామి, అమ్మవార్లు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఉద్యానవ‌న‌ విభాగం డెప్యూటీ డైరెక్ట‌ర్‌ శ్రీ శ్రీనివాసులు, ఏఇవో శ్రీ గోపినాథ్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

No comments :
Write comments