30.7.25

వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి పట్టాభిషేక మహోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ‌ valmikipuram




వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి పట్టాభిషేక మహోత్సవాలు జూలై 29 నుండి 31వ తేదీ వరకు ఘనంగా జరుగనున్నాయి. జూలై 29న సాయంత్రం 6 గంట‌ల‌కు సేనాధిపతి  ఉత్సవం, అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.


జూలై 30వ తేదీన ఉదయం యాగశాల పూజ, ఉద‌యం 10 గంట‌ల‌కు స్నపన తిరుమంజనం ఘనంగా నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటలకు ఊంజల్‌సేవ, సాయంత్రం 6.30 గంటలకు శ్రీ సీతారాముల‌ శాంతి కళ్యాణం, రాత్రి 8 గంటలకు హనుమంత వాహనసేవ నిర్వహించనున్నారు.

జూలై 31న ఉదయం యాగశాల పూజ, ఉద‌యం 6.30 గంట‌ల‌కు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం వైభవంగా జరుగనుంది. సాయంత్రం 6 గంటలకు ఊంజల్‌ సేవ, రాత్రి 8 గంటలకు గరుడ వాహనంపై శ్రీపట్టాభిరాముడు విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తారు. అనంతరం మహాపూర్ణాహుతి, కుంభోద్వాసన, కుంభప్రోక్షణం నిర్వహించనున్నారు.

గృహస్తులు(ఇద్దరు) రూ.300/- చెల్లించి శ్రీరామ పట్టాభిషేకం ఆర్జిత సేవలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు.

ఈ మూడు రోజుల పాటు టీటీడీ హిందూధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో హరికథలు, భజనలు, ఆధ్యాత్మిక భక్తి సంగీత కార్యక్రమాలు జరుగనున్నాయి.

ఆలయ ప్రాశ‌స్త్యం

శ్రీ పట్టాభిరామస్వామి వారి ఆలయం చాలా పురాతనమైనది. జాంబవంతుడు ఇక్కడ సీత, లక్ష్మణ, భరత, శత్రుఘ్ను, హనుమత్‌ సమేత శ్రీ పట్టాభిరామస్వామివారిని ప్రతిష్ఠించాడని ఇక్కడి స్థలపురాణం. ఈ ఆలయ ద్వారం ఉత్తర దిక్కుకు ఉన్నది. ఈ ఆలయం చోళుల శైలితో నిర్మించబడినది. 

ఈ కార్యక్రమంలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మీ, అర్చకులు, అధికారులు పాల్గొన్నారు. 

No comments :
Write comments