29.8.25

“నేత్రదానం ద్వారా మరొకరికి కొత్త జీవితం” ఎస్వీ అరవింద్ కంటి ఆసుపత్రిలో నేత్రదాన కేంద్రాన్ని ప్రారంభించిన టిటిడి ఈఓ శ్రీ జె. శ్యామలారావు eye donation center






శ్రీవారి భక్తులు, ప్రజలు స్వచ్ఛందంగా నేత్రదానం చేసి ఎంతో మందికి కొత్త జీవితాన్ని అందించాల‌ని టిటిడి ఈఓ శ్రీ జె. శ్యామలారావు పిలుపునిచ్చారు. తిరుపతి అలిపిరి సమీపంలోని శ్రీ వేంకటేశ్వర అరవింద్ కంటి ఆసుపత్రిలో గురువారం నేత్రదాన కేంద్రాన్ని ప్రారంభించి, ఈ సందర్భంగా ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్ 9398358828ను విడుదల చేశారు.


జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 25 – సెప్టెంబరు 8 వరకు 40వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు శ్రీ వేంకటేశ్వర అరవింద్ కంటి ఆసుపత్రిలో జరుగుతున్నవి. 

ఈ సందర్భంగా ఈ సందర్భంగా ప్రారంభించిన నేత్రదాన కేంద్రం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈఓ మాట్లాడుతూ, “సర్వేంద్రియాణాం నయనం ప్రధానమ్” అనే సంస్కృత వాక్యాన్ని ఉదహరిస్తూ, శరీరంలోని అన్ని ఇంద్రియాలలో కంటికి ఉన్న ప్రాధాన్యత అత్యంత ఉత్కృష్టమైనది అన్నారు. 2019లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టితో, శ్రీ వేంకటేశ్వర స్వామి పాదాల చెంత ఆరు ఎకరాల విస్తీర్ణంలో తిరుపతి నగరంలో ఈ సుప్రసిద్ధ కంటి ఆసుపత్రి స్థాపించబడిందని గుర్తు చేశారు.

ప్రతి సంవత్సరం మన దేశంలో కార్నియల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ (కంటి మార్పిడి) కోసం కనీసం ఒక లక్ష కళ్ళు అవసరం ఉంటే, కేవలం 25 వేల కళ్ళే అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం 11 లక్షలకు పైగా రోగులు కార్నియల్ ట్రాన్స్‌ప్లాంట్ కోసం ఎదురుచూస్తున్నారని, ఒక్కరి నేత్రదానం ద్వారానే ఇద్దరికి దృష్టి లభిస్తుందని చెప్పారు.

అరవింద్ కంటి ఆసుపత్రిలో 80 శాతం కంటి సమస్యలకు అత్యల్ప ఖర్చుతో ఆధునిక వైద్యసేవలు అందిస్తున్నారని, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది కృషిని అభినందించారు. హార్వర్డ్ బిజినెస్ స్కూల్ (HBS) అధ్యయనాలు కూడా అరవింద్ నేత్రాసుపత్రిని సామాజిక ఆరోగ్య సేవల్లో ఆదర్శంగా గుర్తించిందన్నారు.

“డయల్ యువర్ ఈఓ” కార్యక్రమంలో ఒక భక్తుడు చేసిన సూచన మేరకు ఈ నేత్రదాన కేంద్రం ఇవాళ తిరుపతిలో ప్రారంభించడం జరిగిందని చెప్పారు. కంటి దానం ద్వారా 80% వరకు అంధత్వ సమస్యలను అధిగమించవచ్చని, అందుకొరకు విస్తృతంగా  అవగాహన కల్పించాలని సూచించారు.

ప్రపంచ ప్రసిద్ధ హైందవ ధార్మిక సంస్థ అయిన టిటిడి అనేక సేవా కార్యక్రమాలు చేపడుతోందని, నేత్రదానం వంటి సేవా కార్యక్రమాల్లో భక్తులు ముందుకు రావాలని ఈఓ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

ముందుగా ఎస్వీ అరవింద్ ఆసుపత్రి సీఎంఓ డాక్టర్ అశోక్ వర్ధన్ ఆసుపత్రి ప్రస్థానాన్ని వివరించారు. 2024లో 3.5 లక్షల అవుట్‌పేషెంట్లకు చికిత్స అందించి, 5 వేల శస్త్రచికిత్సలు నిర్వహించామన్నారు. ప్రతి సంవత్సరం కేవలం 25 వేల కంటి దానాల ద్వారానే అవసరం తీరుతుందని, మరింత చైతన్యం అవసరమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్విమ్స్ వీసీ మరియు డైరెక్టర్ డాక్టర్ ఆర్‌.వి. కుమార్, అరవింద్ ఆసుపత్రి జీఎం శ్రీ కేశవకుమార్, డీఎంహెచ్ఓ శ్రీ మురళీకృష్ణ, తిరుపతి ఆఫ్థాల్మాలజిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ సురేంద్ర, టిటిడి ఎస్ఎంఓ డాక్టర్ కుసుమతో పాటు పలువురు వైద్యులు, అధికారులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

No comments :
Write comments