7.9.25

అనంత పద్మనాభవ్రతం సందర్భంగా శాస్త్రోక్తంగా చక్రస్నానం ananta padmanabha swamy vari vratam






తిరుమలలో అనంత పద్మనాభవ్రతం సందర్భంగా శనివారం ఉదయం శ్రీవారి పుష్కరిణిలో శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు.

అనంత పద్మనాభ వ్రతాన్ని ప్రతి ఏటా తిరుమలలో భాద్రపద శుక్ల చతుర్దశి నాడు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఉదయం పూజలు చేసిన తరువాత శ్రీ సుదర్శన చక్రత్తాళ్వారును ఆలయం నుండి ఊరేగింపుగా తీసుకెళ్లి శ్రీ వరాహస్వామి ఆలయం చెంత ఉన్న స్వామి పుష్కరిణిలో పాలు, పెరుగు, తేనె, కొబ్బ‌రినీళ్లు, ప‌సుపు, చంద‌నంతో విశేషంగా అభిషేకం చేపట్టారు. అనంత‌రం చక్రస్నానం నిర్వహించారు.
శ్రీ మహావిష్ణువు అనంతకోటి రూపాలలో కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవేంకటేశ్వరస్వామి వారికి ఎంత ప్రాశస్త్యం ఉందో అదేవిధంగా శయన మూర్తిగా శ్రీ అనంత పద్మనాభస్వామికి అంతే వైశిష్ఠ్యం ఉంది. ప్రతి ఏటా ఈ పర్వదినాన దేశవ్యాప్తంగా ఉన్న 108 శ్రీ వైష్ణవ దివ్యక్షేత్రాలలో అనంత పద్మనాభ వ్రతం నిర్వహించడం ఆనవాయితీగా వ‌స్తోంది. తిరుమల 108 శ్రీ వైష్ణవ దివ్య దేశాలలో ప్రధానమైనది కావడంతో అనంత పద్మనాభ వ్రతాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలలో చివరి రోజున, వైకుంఠ ద్వాదశి, రథసప్తమి, ఆనంత పద్మనాభవ్రతం పర్వదినాలలో మాత్రమే చక్రస్నానం నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

No comments :
Write comments