28.9.25

డ్రైఫ్రూట్ల మాలలతో శోభాయమానంగా స్పపన తిరుమంజనం dry fruits garland










శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం శ్రీవారి ఆలయంలో డ్రైఫ్రూట్లు, రోజామాలల అలంకారంతో స్నపనతిరుమంజనం శోభాయమానంగా జరిగింది. ఆలయంలోని రంగనాయకుల మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ రకాల ఫలాలు, పుష్పాలతో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను అందంగా అలంకరించారు.

బాదం, పిస్తా, కుంకుమపువ్వు, వట్టివేరు, పసుపు కొమ్ములు, ఎండు ద్రాక్ష, యాలకులు, తులసి, రోజామాలలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారి ఉత్సవమూర్తులను అలంకరించారు. వివిధ రంగుల పుష్పాలు, ఫలాలు, సాంబ్రాణి, ధూపదీప నైవేద్యాల నడుమ రంగనాయకుల మండపం నూతనత్వాన్ని సంతరించుకుంది. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు కొబ్బరినీళ్లు తదితర సుగంధద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. వేదపండితులు చతుర్వేదపారాయణం ఆలపించారు. బ్రహ్మోత్సవాల సమయంలో వాహనసేవల్లో తిరువీధుల్లో ఊరేగి అలసిపోయే స్వామివారు స్నపనతిరుమంజనంతో సేద తీరుతారని ఆలయ అర్చకులు తెలిపారు. కంకణభట్టర్‌ శ్రీ వేణుగోపాలదీక్షితులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ చిన్నజీయంగార్‌, టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments