16.9.25

టీటీడీ విజిలెన్స్, పోలీసు అధికారులతో అదనపు ఈవో సమన్వయ సమావేశం ttd addl eo





సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2వ తేది వరకు నిర్వహించనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో సోమవారం తిరుపతి ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడుతో కలిసి టీటీడీ విజిలెన్స్, పోలీసు అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో భక్తుల భద్రత, రవాణా, పార్కింగ్, క్రౌడ్ మేనేజ్మెంట్ అంశాలపై విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా అదనపు ఈవో మీడియాతో బ్రహ్మోత్సవాల్లో తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై అధికారులతో చర్చించి ప్రణాళికలు సిద్దం చేసినట్లు తెలియజేశారు.
భక్తుల సౌకర్యార్థం ఏపీఎస్ ఆర్టీసీ ద్వారా రోజుకు 435 బస్సులు నడుస్తున్నాయని, దీని ద్వారా రోజుకు సుమారు 1.60 లక్షల మంది భక్తులకు పికప్, డ్రాప్ సౌకర్యం కల్పించవచ్చని చెప్పారు. తిరుపతిలోని 23 పార్కింగ్ ప్రదేశాలను వాహనాల పార్కింగ్ కోసం సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.
మాడ వీధుల్లోని గ్యాలరీల్లో 1.85 లక్షల నుండి 2 లక్షల వరకు భక్తులు కూర్చునే సదుపాయం ఉందని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వాహన సేవలను తిలకించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.
4200 మంది పోలీసులు, 1500 మంది విజిలెన్స్ సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా క్రౌడ్ మూవ్‌మెంట్, రద్దీ పాయింట్లను రియల్ టైమ్ మానిటరింగ్ చేసేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు.
ముఖ్యమంత్రి, రాజ్యాంగపరమైన అధినేతలు, వీఐపీల రాకపోకలకు ప్రత్యేక ఎంట్రీ, ఎగ్జిట్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. సోషల్ మీడియాలో తప్పుదారి పట్టించే ప్రచారాన్ని వెంటనే కౌంటర్ చేసేందుకు ప్రత్యేక టీమ్‌ లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు.
వీలైనంత వరకు సురక్షితమైన పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ సేవలను వినియోగించుకోవాలని ఈ సందర్భంగా అదనపు ఈవో భక్తులకు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ, అదనపు ఎస్పీ శ్రీ రామకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments