21.9.25

తిరుమల పవిత్రత, ప్రశాంతత కాపాడటం మనందరి బాధ్యత టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి ttd addl eo




తిరుమల పవిత్రత, ప్రశాంతత కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ముఖ్యంగా భక్తులకు సరైన సమాచారం అందించే విషయంలో మీడియా పాత్ర మరింత కీలకమైనదని టీటీడీ అదనపు ఈఓ శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి అన్నారు.

తిరుమలలోని అన్నమయ్య భవన్ లో శనివారం టీటీడీ సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణతో కలిసి మీడియా ప్రతినిధులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీడియా ప్రతినిధుల నుండి ప్రయోజనకరమైన సూచనలను ఎల్లప్పుడూ స్వాగతిస్తామని పేర్కొన్నారు.
ఇటీవల కాలంలో సోషల్ మీడియా వేగంగా పెరుగుతోందని, కానీ చాలామంది యూట్యూబర్లు భక్తులకు సరైన సమాచారం ఇవ్వకుండా, అవాస్తవ మైన ఆధారరహిత వార్తలతో గందరగోళానికి గురి చేస్తున్నారని చెప్పారు. ఇటువంటి తప్పుడు వార్తలు  ప్రపంచవ్యాప్తంగా ఉండే శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బ తినే అవకాశం ఉంటుందని తెలిపారు.
తిరుమల కొండల పవిత్రతను కాపాడటం, టీటీడీ కార్యక్రమాలను ప్రోత్సాహించే విషయంలో మీడియాపై ఎంతో బాధ్యత ఉందని అభిప్రాయపడ్డారు. తిరుమలలో ఎన్నో ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న  మీడియా ప్రతినిధులకు తిరుమలలో జరుగుతున్న అభివృద్ధిపై, భక్తులకు టీటీడీ అందిస్తున్న విశేష సేవలపై ఎంతో అవగాహన ఉంటుందని తెలిపారు.
టీటీడీపై అసత్య కథనాలతో దుష్ప్రచారం చేసే వారిని నియంత్రించేందుకు మీడియా ప్రతినిధులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వాస్తవాలను ప్రజలకు చేరవేయాలని కోరారు.
ఈ సమావేశంలో డీఎఫ్వో శ్రీ ఫణి కుమార్ నాయుడు, సీపిఆర్వో డాక్టర్ టి. రవి, వీజీవోలు శ్రీ రామ్ కుమార్, శ్రీ సురేంద్ర ఇతర అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments