1.10.25

అన్న‌ప్ర‌సాదాల పంపిణీపై 99శాతం భ‌క్తుల్లో సంతృప్తి : అన్న‌ప్ర‌సాద విభాగం డిప్యూటీ ఈవో శ్రీ ఎం.రాజేంద్ర‌ కుమార్ annaprasadam

 




శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల్లో అన్న ప్ర‌సాదాల పంపిణీపై 99 శాతం భ‌క్తులు సంతృప్తి వ్య‌క్తం చేశార‌ని టీటీడీ అన్న‌ప్ర‌సాద విభాగం డిప్యూటీ ఈవో శ్రీ ఎం.రాజేంద్ర కుమార్ తెలిపారు. తిరుమ‌ల‌లోని రామ్ భ‌గీచా - 2లో ఏర్పాటు చేసిన మీడియా సెంట‌ర్ లో అన్న ప్ర‌సాద విభాగం ప్ర‌త్యేక అధికారి శ్రీ జీ ఎల్ ఎన్ శాస్త్రితో క‌లిసి ఆయ‌న మంగ‌ళ‌వారి మీడియా స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన‌ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, నాణ్యతకు ప్రాధాన్యతనిస్తూ అన్నప్రసాదం, అల్పాహారం, పాలు, మజ్జిగ భక్తులకు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. దాత‌లు 23 ర‌కాల కూర‌గాయ‌ల‌ను విరాళంగా అందించార‌ని వివ‌రించారు. బ్ర‌హ్మోత్స‌వాల్లో 24వ తేది నుండి 29వ తేది వ‌ర‌కు 23,48,337 మంది భ‌క్తుల‌కు అన్న ప్ర‌సాదాలు అందించ‌గా 11,32,160 మంది భ‌క్తుల‌కు పానీయాలు అంద‌జేశామ‌ని చెప్పారు. 
అన్న‌ప్ర‌సాదం ప్ర‌త్యేక అధికారి శ్రీ జీ ఎల్ ఎన్ శాస్త్రి మాట్లాడుతూ విశేష‌మైన గ‌రుడ వాహ‌నం రోజున నాలుగ మాడ వీధుల్లోని గ్యాల‌రీలతో పాటు హోల్డింగ్ పాయింట్ల వ‌ద్ద 9,28,000 మంది భ‌క్తుల‌కు అన్న ప్ర‌సాదాలు, 6,27,200 మందికి పానీయాలు పంపిణీ చేశామ‌ని తెలిపారు. 4,36,994 మంది భ‌క్తుల‌కు బిస్కెట్ ప్యాకెట్లు, సుండ‌లు పంపిణీ చేసిన‌ట్లు పేర్కొన్నారు. మొత్తం 16 ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను త‌యారు చేసి గ్యాల‌రీల్లోని భ‌క్తుల‌కు ఇబ్బంది క‌ల‌గ‌కుండా ప్ర‌తి గంట‌కు ఒక్కొ ర‌క‌మైన ప్ర‌సాదాన్ని పంపిణీ చేశామ‌న్నారు.  దాదాపు 30వేల మంది భ‌క్తుల‌కు బాదం పాలు పంపిణీ చేసిన‌ట్లు చెప్పారు.
దాదాపు 1300 మంది సిబ్బంది భ‌క్తుల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు అన్న ప్ర‌సాదాలు చేర‌వేసేందుకు అహ‌ర్నిశ‌లు కృషి చేశార‌ని చెప్పారు. ర‌ద్దీ ఎక్కువ‌గా ఉండ‌టంతో పోలీసుల సాయంతో మాడ‌వీధుల్లోకి అన్న ప్ర‌సాదాల‌ను తీసుకెళ్లేందుకు ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని చెప్పారు. గ‌త సంవ‌త్స‌రంతో పోల్చితే ఈ ఏడాది 33శాతం అధికంగా అన్న ప్ర‌సాదాలు పంపిణీ చేసిన‌ట్లు తెలియ‌జేశారు. భక్తులకు అన్నప్రసాదాలు అందించడంలో శ్రీవారి సేవకులు విశేషంగా సేవలు అందించారన్నారు. 
ఈ కార్య‌క్ర‌మంలో టీటీడీ సీపీఆర్వో డాక్ట‌ర్ టి.ర‌వి పాల్గొన్నారు.

No comments :
Write comments