తిరుచానూరులోని
శ్రీ పద్మావతి అమ్మవారి పంచమితీర్థ మహోత్సవం సందర్భంగా టిటిడి అన్నప్రసాద విభాగం ఆధ్వర్యంలో 1.50 లక్షల మంది భక్తులకు అన్నప్రసాదాలు, అల్పాహారం అందించారు. టిటిడి ఛైర్మెన్ శ్రీ బీఆర్ నాయుడు, ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశాల మేరకు టిటిడి జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం పర్యవేక్షణలో అన్నప్రసాదం విభాగం అధికారులు ప్రతి భక్తుడికి అన్నప్రసాదాలు అందేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు.భక్తుల సౌకర్యార్థం 160 కౌంటర్లలో తోళ్లప్ప గార్డెన్స్లో 50, జిల్లా పరిషత్ హైస్కూల్ వద్ద 40, శ్రీ అయ్యప్పస్వామివారి ఆలయం వద్ద 50, పూడి వద్ద 20 అన్నప్రసాదం కౌంటర్లలో 24వ తేదీ రాత్రి నుండి 25వ తేదీ ఉదయం, మధ్యాహ్నం వరకు కదంబం, చక్కెర పొంగలి, దద్దోజనం, పులిహోర, ఉదయం ఉప్మా, పొంగలిని విరివిగా అందజేశారు. పంచమి తీర్థం కోసం శ్రీ పద్మావతీ అన్నప్రసాద కేంద్రం, శ్రీనివాసం కాంప్లెక్స్, టిటిడి పరిపాలనా భవనంలోని ఎంప్లాయిస్ క్యాంటిన్ ల నుండి 13 బాయిలర్స్ ద్వారా వంటలను తయారు చేసి హోల్డింగ్ పాయింట్లు, గ్యాలరీలు, క్యూలైన్లు, భక్తులు అధికంగా ఉండే కూడళ్ల వద్ద పంపిణీ చేశారు. వంటలలో నాణ్యత, రుచి, శుచి మరింత మెరుగ్గా ఉండేందుకు జీడిపప్పు, నెయ్యిని అదనంగా ఉపయోగించారు.
1.25 లక్షల మందికి బాదంపాలు
పంచమి తీర్థం సందర్భంగా అన్నప్రసాదాలతో పాటు 1.25 లక్షల మందికి బాదంపాలు, లక్ష మందికి బిస్కెట్ ప్యాకెట్లు, 30వేల మందికి మజ్జిగ, 30 వేల మందికి సుండలను అందించారు. భక్తులకు సకాలంలో అన్నప్రసాదాలను అందించేందుకు 900 మంది శ్రీవారి సేవకులు, 100 ఎన్. ఎస్. ఎస్. విద్యార్థులు, 200 మంది అన్నప్రసాదం సిబ్బంది, 500 మంది ఎఫ్.ఎం.ఎస్ సిబ్బంది సేవలు అందించారు.
దాదాపు 1.50 లక్షల తాగునీటి బాటిళ్ల పంపిణీ
పంచమితీర్థం సందర్భంగా విచ్చేసిన లక్షలాది మంది భక్తులకు టిటిడి ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో దాదాపు 1.50 లక్షల తాగునీటి బాటిళ్లు పంపిణీ చేశారు. ఆలయం, పుష్కరిణి పరిసరాల్లో ఎప్పటికప్పుడు చెత్తను తొలగించి పరిశుభ్రంగా ఉంచారు. భక్తుల సౌకర్యార్థం 300 శాశ్వత, తాత్కాలిక, మొబైల్ మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. బ్రహ్మోత్సవాల్లో రోజుకు 300 మంది, పంచమితీర్థం రోజున 600 మంది పారిశుద్ధ్య సిబ్బంది సేవలందించారు. టిటిడి ఆరోగ్యశాఖ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
No comments :
Write comments