తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో చివరిరోజైన నవంబర్ 25వ తేదీ మంగళవారం పంచమితీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారెను పంపనున్నారు. ప్రతి ఏటా పంచమితీర్థం రోజున తిరుమల నుంచి సారెను తీసుకెళ్లడం ఆనవాయితీగా వస్తోంది.
ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఉదయం 2.30 నుండి 4.30 గంటల వరకు పరిమళాన్ని విమాన ప్రాకారంలో ఊరేగింపు చేపట్టి, శ్రీవారి వక్ష:స్థల లక్ష్మీ అమ్మవారికి ఏకాంతంగా తిరుమంజనం చేపడతారు. ఆ తరువాత ఉదయం 4.30 గంటలకు తిరుమల శ్రీవారి ఆలయం నుంచి పసుపు, కుంకుమ, ప్రసాదాలు, తులసి, వస్త్రాలు, ఆభరణాలతో కూడిన సారె ఊరేగింపు మొదలవుతుంది.
ఈ సారెను గజాలపై ఆలయ నాలుగు మాడ వీధుల గుండా ఊరేగించి అనంతరం కాలినడకన తిరుమల నుంచి తిరుపతిలోని అలిపిరి వద్దకు తీసుకెళతారు. అక్కడినుండి కోమలమ్మ సత్రం, తిరుచానూరు పసుపు మండపం మీదుగా పద్మపుష్కరిణి వద్ద అమ్మవారికి సారె సమర్పించనున్నారు.
No comments :
Write comments