4.11.25

శాస్త్రోక్తంగా రాజంపేట‌ శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆల‌య కుంభాభిషేకం - వేడుకగా శ్రీనివాస కల్యాణం




అన్నమయ్య జిల్లా రాజంపేట సమీపంలోని శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారి (108 అడుగల) విగ్రహం వద్ద శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆల‌య‌ కుంభాభిషేకం సోమ‌వారం  శాస్త్రోక్తంగా   జ‌రిగింది.


ఇందులో భాగంగా ఉదయం 4 గంటల నుండి 5 గంట‌ల వ‌ర‌కు విగ్రహ ప్రతిష్ట, అష్టబంధన సమర్పణం, పంచగవ్య స్నపనం, మూర్తి హోమం, శాంతి హోమం, ప్రాయచిత్తహోమం నిర్వహించారు. ఉదయం 9.30 నుండి 10.30 గంట‌ల లోపు ధనుర్ లగ్నం నందు మహాకుంభప్రోక్షణ, ప్రాణ ప్రతిష్టాన్యాసములు, ప్రధమ కాలారాధనం, మహా మంగళహారతి, ధ్వజారోహణం నిర్వ‌హించారు. అనంత‌రం భ‌క్తుల‌ను ద‌ర్శ‌నానికి అనుమ‌తించారు.

వేడుకగా శ్రీనివాస కల్యాణం

రాజంపేట‌లో సాయంత్రం 6 గంటలకు వేద పండితులు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి ఉత్సవర్లను కల్యాణవేదిక వద్దకు వేంచేపు చేసి వైదిక కార్యక్రమాల్లో భాగంగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, కంకణధారణ, అగ్నిప్రతిష్టాపన, యజమాని సంకల్పం, భక్త సంకల్పం, మహాసంకల్పం, మంగళసూత్రధారణ ఘట్టాలతో వేదమంత్రాలు పఠిస్తూ శాస్త్రోక్తంగా స్వామివారి కల్యాణాన్ని నిర్వహించారు. చివరిగా నక్షత్రహారతి, మంగళహారతి కార్యక్రమంతో కల్యాణం దిగ్విజయంగా ముగిసింది. శ్రీవారు, అమ్మవార్ల కల్యాణ ఘట్టాన్ని నేత్రపర్వంగా తిలకించిన భక్తులు భక్తిపరవశంతో పులకించారు.చివరగా ప్రాకారోత్సవం, ధ్వజావరోహణంతో ఆలయ ప్రతిష్టా కుంభాభిషేక మహోత్సవం ముగిసింది. 

 ఈ కార్యక్రమంలో టిటిడి జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం, డిప్యూటీ ఈవోలు శ్రీ ఎ.  శివప్రసాద్, శ్రీమతి ఏ. ప్రశాంతి, ఏఈవో శ్రీ బాలరాజు, సూపరింటెండెంట్ శ్రీ హనుమంతయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ బాలాజీ, ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments