17.11.25

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వైభవంగా లక్ష కుంకుమార్చన laksha kumkumarchana






తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆదివారం ఉదయం లక్ష కుంకుమార్చన సేవ వైభవంగా జరిగింది.


హిందూ సనాతన ధర్మంలో కుంకుమకు ఎనలేని ప్రాధాన్యత ఉంది. వివాహితురాలైన మహిళ నుదుట కుంకుమ ధరించడం వల్ల భర్త దీర్ఘాయుష్షు పొందుతాడని హిందూ ధర్మం చెబుతోంది. లక్ష్మీ, సరస్వతి, పార్వతి అమ్మవార్ల పేర్లతో పిలుస్తున్న శక్తి అమ్మవారికి ప్రతిరూపంగా సింధూరం లేదా కుంకుమకు ప్రాశస్త్యం ఉంది. అమ్మవారి ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు లాంటి భారీ ఉత్సవాలను నిర్వహించే ముందు అర్చకులు లక్ష కుంకుమార్చన నిర్వహించడం సంప్రదాయం. ఈ విశిష్టమైన సేవ ద్వారా అమ్మవారు ప్రసన్నమై ఉత్సవాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా జరిగేలా ఆశీర్వదిస్తారని అర్చకులు తెలిపారు.

 ఆలయంలోని శ్రీకృష్ణ ముఖ మండపంలో శ్రీ పద్మావతి అమ్మవారిని ఆశీనులను చేసి ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అర్చకులు శాస్త్రోక్తంగా లక్ష కుంకుమార్చన సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు లక్ష్మీ అష్టోత్తరం, లక్ష్మీ సహస్రనామాలను వల్లిస్తూ అమ్మవారిని కుంకుమతో అర్చన చేశారు. పెద్ద సంఖ్యలో మహిళలు ఈ సేవలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో  ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, పాంచరాత్ర ఆగమసలహాదారు శ్రీ మ‌ణికంఠ భ‌ట్టర్‌, అర్చకులు శ్రీ బాబుస్వామి, పలువురు అర్చకులు, ఇత‌ర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

No comments :
Write comments