- శ్రీవారి కానుక కమలముల హారం, వజ్రాల అడ్డిగ
• కనులవిందుగా సిరులతల్లికి స్నపనతిరుమంజనం
• పద్మపుష్కరిణిలో పవిత్రస్నానంతో భక్తుల తన్మయత్వం
• అసంఖ్యాకంగా పాల్గొన్న భక్తులు
• అధికారులు, సిబ్బంది, పోలీసులు, శ్రీవారి సేవకుల సేవలను అభినందించిన టీటీడీ ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు
తిరుపతి, 2025 నవంబరు 25:శ్రీ పద్మావతి అమ్మవారు అవతరించిన పంచమి తిథిని పురస్కరించుకుని కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన మంగళవారం పంచమీ తీర్థం(చక్రస్నానం) అశేష భక్తజనవాహిని మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. పద్మ పుష్కరిణిలో అసంఖ్యాకంగా పవిత్రస్నానం ఆచరించిన భక్తులు ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని పొందారు.
ఈ సందర్భంగా ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ, లక్షలాది మంది భక్తుల సమూహంలో అమ్మవారి పంచమీతీర్థ మహోత్సవం వైభవోపేతంగా జరిగిందన్నారు. వేలాదిమంది భక్తులు పుణ్య స్థానాలు ఆచరిస్తున్నట్లు చెప్పారు. భక్తులకు ఎక్కడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా టిటిడిలోని అన్ని విభాగాలు పటిష్టమైన ఏర్పాట్లు చేసి, విజయవంతంగా జరిగాయన్నారు. అన్ని విభాగాల అధికారులు, భద్రతా సిబ్బంది, పోలీసులు, శ్రీవారి సేవకులు, పారిశుద్ధ్య కార్మికులు విశేషంగా కృషి చేశారని వారిని అభినందించారు. భక్తులందరికీ అమ్మవారి కరుణాకటాక్షాలు కలగాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.
అంతకుముందు ఉదయం శ్రీ పద్మావతి అమ్మవారు పల్లకీలో ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు. అనంతరం అమ్మవారికి ఆస్థానం నిర్వహించి ఉత్సవర్లను ఊరేగింపుగా పంచమీతీర్థ మండపానికి వేంచేపు చేశారు. తిరుమల శ్రీవారి ఆలయం వద్ద తెల్లవారుజామున 4.30 గంటలకు బయలుదేరిన సారె ఉదయం 11 గంటలకు తిరుచానూరు అమ్మవారి ఆలయానికి చేరుకుంది. అర్చకులు పంచమి తీర్థ మండపంలో సారెను అమ్మవారికి సమర్పించి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.
అమ్మవారికి శ్రీవారి కానుక
శ్రీ పద్మావతి అమ్మవారి పంచమీ తీర్థం సందర్బంగా శ్రీ వేంకటేశ్వర స్వామివారు కానుకలు పంపారు. రూ.1.31 కోట్లు విలువైన 1.14 కిలోల బరువు గల బంగారు కమలముల హారం,
వజ్రాల అడ్డిగ నగ, సారెతో పాటు తిరుపతి పురవీధులలో ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారికి అలంకరించారు.
శోభాయమానంగా సిరులతల్లికి స్నపనతిరుమంజనం
పంచమీ తీర్థ మండపంలో అమ్మవారికి, చక్రత్తాళ్వార్కు ఉదయం వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంలతో విశేషంగా అభిషేకం చేశారు. ఈ సందర్భంగా అమ్మవారికి అలంకరించిన కుంకుమపువ్వు, పైనాపిల్, డ్రై ఫ్రూట్స్, రెడ్ మరియు ఎల్లో రోజాపెటల్స్, వట్టివేరు, తులసిమాలలు, కిరీటాలు భక్తులకు కనువిందు చేశాయి.
పంచమి తీర్థం సందర్భంగా పంచమి మండపం వద్ద ఒక టన్ను పుష్పాలతో ఏర్పాటు చేసిన మండపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఇందులో తామర పూలు, రోజాలు, లిల్లీలు తదితర సంప్రదాయ పుష్పాలు, కట్ ఫ్లవర్స్ తో గార్డెన్ సిబ్బంది అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు.
మధ్యాహ్నం 12.10 నుండి 12.20 గంటల మధ్య పంచమి తీర్థం(చక్రస్నానం) ఘట్టం ఘనంగా జరిగింది. చక్రత్తాళ్వార్తో పాటు పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తజనం పద్మ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు.
కాగా రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు బంగారు తిరుచ్చి వాహనంలో అమ్మవారి ఉత్సవర్లను ఊరేగించనున్నారు. అనంతరం రాత్రి 10 నుండి 11 గంటల వరకు శాస్త్రోక్తంగా ధ్వజావరోహణం జరుగనుంది.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, టీటీడీ ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు, ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, చంద్రగిరి ఎంఎల్ఏ శ్రీ పులివర్తి నాని, పలువురు బోర్డు సభ్యులు శ్రీ ఎన్. సదాశివరావు, శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, శ్రీ నరేష్ కుమార్, శ్రీ ఎం.శాంతారామ్, శ్రీమతి జానకి దేవి, శ్రీమతి అనుగోలు రంగశ్రీ, ఎక్స్ అఫిషియో మెంబర్ శ్రీ సి.దివాకర్ రెడ్డి,
జెఈవో శ్రీ వి.వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ కే.వి. మురళీకృష్ణ, ఎస్పీ శ్రీ ఎల్ . సుబ్బరాయుడు, సిఈ శ్రీ సత్యనారాయణ, ఎఫ్ ఏ అండ్ సీఏవో శ్రీ ఓ బాలాజీ, డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
నవంబరు 26న పుష్పయాగం
నవంబరు 26వ తేదీ బుధవారం ఆలయంలో పుష్పయాగం సాయంత్రం 5 నుండి 8 గంటల వరకు వైభవంగా జరుగనుంది.




No comments :
Write comments