6.11.25

‘శ్రవణం’ను పరిశీలించిన టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ ttd eo inspects sravanam







టిటిడి ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీవేంకటేశ్వర శ్రవణం సంస్థను టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ బుధవారం పరిశీలించారు. ముందుగా శ్రవణంకు ఈవో చేరుకోగానే టిటిడి డిఈవో శ్రీ వెంకట సునీల్, ఎస్.ఈలు శ్రీ వేంకటేశ్వర్లు, శ్రీ మనోహరం, శ్రవణం సిబ్బంది స్వాగతం పలికారు.


ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, వినికిడి లోపంగల పిల్లలకు ఆధునిక పద్దతుల ద్వారా ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ముందుగా పిల్లల తల్లులతో ఈవో మాట్లాడారు. సమయానికి పాలు, బిస్కెట్లు, టిఫిన్, అన్నం అందుతుందా, తాగునీరు, శిక్షణ ఎలా ఉంది, శిక్షణలో పురోగతి ఉందా, శిక్షణపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారా, సౌకర్యాలు ఎలా ఉన్నాయని పిల్లల తల్లులను అడిగి తెలుసుకున్నారు. గంగాధర నెల్లూరు, పుంగనూరు, గుంటూరు, విశాఖ, అనంతపురం, చిత్తూరు తదితర ప్రాంతాల పిల్లల తల్లులతో ఈవో మాట్లాడారు.

శ్రవణంలో చేరాక పిల్లల మాటల ఉచ్చరణ, మాటలను అర్థం చేసుకునే సామర్థ్యంలో పురోగతి ఉందా అని తెలుసుకున్నారు. తరగతి గదులలో ఆధునిక వసతులు ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. డే స్కాలర్ పిల్లలకు మధ్యాహ్న భోజనం సదుపాయం, శిక్షణ పూర్తి అయ్యాక ఆధునిక వినికిడి పరికరాలు అందించే అంశం, మెరుగైన బోధనాంశాలు, బోధనా పద్దతులు, స్టేషనరీ, స్టడీ మెటీరియల్, పాఠ్యాంశాలు తదితర అభివృద్ధి పనులపై సమగ్ర నివేదిక తయారు చేయాలని డిఈవో శ్రీ టి. వెంకట సునీల్ ను ఆదేశించారు.    
తరగతి గదులు బాగా పాత పడ్డాయని, లైటింగ్, బోధనా పరికరాలు ఉంచేందుకు అవసరమైన ఇంజనీరింగ్ పనులు చేపట్టాలన్నారు.

ఏడాది, ఏడాదిన్నర, రెండేళ్లు, మూడేళ్ల పిల్లలకు బోధిస్తున్న పద్దతులను దగ్గరుండి పరిశీలించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. ఆడియో, వీడియో, ఆట, పాటల ద్వారా పిల్లలు సులువుగా  గ్రహించగలుతారని, సరళమైన పద్దతుల ద్వారా పిల్లలకు బోధించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు శ్రీ జీ. భానుప్రకాష్ రెడ్డి, ఈఈ శ్రీ జగన్మోహన్ రెడ్డి, డిఈ శ్రీమతి సరస్వతి, శ్రవణం ప్రాజెక్ట్ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

No comments :
Write comments