తిరుమలలోని శాసనాలను అనువదించి శ్రీ వేంకటేశ్వరస్వామివారి వైభవం విశ్వవ్యాప్తం కావడానికి కృషి చేసిన మహనీయుడు శ్రీమాన్ సాధు సుబ్రహ్మణ్యశాస్త్రి అని అద్దెంకి ప్రభుత్వ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ డా|| డా.గాలి గుణశేఖర్ చెప్పారు. శ్రీమాన్ సాధు సుబ్రమణ్యశాస్త్రి 137వ జయంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం 9 గంటలకు తిరుపతిలోని శ్వేత భవనం ఎదురుగా గల సుబ్రమణ్యశాస్త్రి కాంస్య విగ్రహానికి పుష్పాంజలి సమర్పించారు.
అనంతరం సాయంత్రం 6 గంటలకు శ్రీమాన్ సాధు సుబ్రహ్మణ్యశాస్త్రి 137వ జయంతి సందర్భంగా తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో సాయంత్రం 6 గంటలకు సాహితీ సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా డా|| గాలి గుణశేఖర్ మాట్లాడుతూ, శ్రీమాన్ సుబ్రమణ్యశాస్త్రి శ్రీవారి ఆలయ పేష్కారుగా ఉంటూ ఎపిగ్రాఫిస్టుగా 1167 రాగిరేకుల శాసనాలను సేకరించి అనువదించినట్టు తెలిపారు. అన్నమయ్య కీర్తనల భాండాగారం నుంచి చాలా రాగి రేకులను వెలికితీసి కీర్తనలను వెలుగులోకి తెచ్చినట్టు వివరించారు. వీటిని 1931వ సంవత్సరంలోనే ఎపిగ్రాఫిక్స్ సిరీస్గా మద్రాసులోని తిరుపతి శ్రీమహంతుల ప్రెస్లో ప్రచురించినట్టు తెలిపారు. దేవస్థానం ఉద్యోగిగా మాత్రమే కాకుండా పురాతన వస్తు పరిశోధనా శాస్త్రవేత్తగా స్వామివారి వైభవాన్ని మొట్టమొదటిసారిగా ఎలుగెత్తి చాటిన ఘనత శాస్త్రికి దక్కిందన్నారు.
తరువాత శ్రీమతి సాధు గిరిజాదేవి మాట్లాడుతూ, తన తండ్రి టిటిడికి చేసిన సేవలకు గుర్తుగా ప్రతి ఏటా ఆయన జయంతి, వర్ధంతి కార్యక్రమాలు జరపడం ఆనందంగా ఉందన్నారు.
ఈ సందర్భంగా శ్రీ సాధు సుబ్రహ్మణ్యశాస్త్రి కుమార్తె శ్రీమతి గిరిజాదేవి, మనవడు, జడ్జి శ్రీ సిఎన్.మూర్తిని అన్నమాచార్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి డా.మేడసాని మోహన్ సన్మానించి శ్రీవారి ప్రసాదాలను అందించారు.
ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు శ్రీమతి లత, ఇతర అధికారులు, పుర ప్రజలు పాల్గొన్నారు.



No comments :
Write comments