తిరుమలలో
పర్యావరణ పరిరక్షణలో భాగంగా రిసైకిల్ మిషన్ల ఏర్పాటుపై గురువారం తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు.
సెప్టెంబర్ నెలలో ప్రయోగాత్మకంగా తిరుమలలోని యాత్రికుల వసతి సముదాయం-5 (PAC-5) లో ఏర్పాటు చేసిన రెక్లెయిమ్ డిపాజిట్ రీఫండ్ మిషన్లకు విశేష స్పందన రావడంతో తిరుమలలో ఈ మిషన్లను మరి కొన్నింటిని పరిశీలనాత్మకంగా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.
తిరుమలలో టెట్రాపాక్ మరియు టిన్ లలో పానీయాలను స్వీకరించిన అనంతరం భక్తులు ఎక్కడంటే అక్కడ పడేయకుండా ఈ డిపాజిట్ రీఫండ్ మెషిన్ల లో వేస్తే తిరుమలలో పరిశుభ్రత మరింత మెరుగు పడేందుకు దోహదపడుతుందని ఆయన అన్నారు. ఈ విషయం పై తిరుమలలోని వ్యాపారులు, టెట్రా ప్యాక్ డీలర్లు కూడా తోటి వారిలో అవగాహన కల్పించాలని కోరారు.
స్వచ్ఛ తిరుమలలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేయడంలో భాగంగా ఒక ఉద్యమంలా రెక్లైమ్ రీసైకిల్ మెషిన్లపై భక్తులకు విస్తృతంగా అవగాహన కల్పించి తిరుమలలోని ముఖ్యమైన ప్రాంతాల్లో మరిన్ని మెషిన్ల ఏర్పాటు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను అదనపు ఈవో ఆదేశించారు.
ఈ సమావేశంలో డీఎఫ్ఓ శ్రీ ఫణి కుమార్ నాయుడు, డిప్యూటీ ఈవోలు శ్రీ సోమన్నారాయణ, శ్రీ వేంకటేశ్వర్లు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ మధు సూదన్, డిప్యూటీ ఈఈ శ్రీ శ్రీనివాస్, రెక్లైమ్ రీసైకిల్ సంస్థ ప్రతినిధులు శ్రీ కిరణ్, శ్రీ రవి తదితరులు పాల్గొన్నారు.
No comments :
Write comments