తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం డిసెంబరు 16వ తేదీన మధ్యాహ్నం 1.23 గంటలకు ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో డిసెంబరు 17వ తేదీ ఉదయం నుండి స్వామివారికి సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై పాశుర పారాయణాన్ని నివేదిస్తున్నారు. జనవరి 14వ తేది వరకు తిరుప్పావై సేవ కొనసాగనుంది.
ధనుర్మాసానికి విశేష ప్రాధాన్యం
ధనుర్మాసం సందర్భంగా శ్రీవారికి విశేష కైంకర్యాలు నిర్వహిస్తారు. బిల్వ పత్రాలతో సహస్ర నామార్చన చేస్తారు. శ్రీవిల్లి పుత్తూరు చిలుకలను ప్రతి రోజూ స్వామివారికి అలంకరిస్తారు. ధనుర్మాసం సందర్భంగా శ్రీవారికి విశేష ప్రసాదాలను నివేదిస్తారు. పురాణాల ప్రకారం ధనుర్మాసంలో దేవతలు సూర్యోదయానికి ఒకటిన్నర గంట ముందుగా నిద్రలేచి బ్రహ్మ ముహూర్తంలో శ్రీమహావిష్ణువును ప్రత్యేకంగా ప్రార్థిస్తారు. కావున ఈ మాసానికి సౌరమానంలో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.
ఆండాళ్ తిరుప్పావై పారాయణం ప్రాశస్త్యం
12 మంది ఆళ్వార్లలో శ్రీ ఆండాళ్(గోదాదేవి) ఒకరు. ఈమెను నాచియార్ అని కూడా పిలుస్తారు. శ్రీవేంకటేశ్వరస్వామివారిని స్తుతిస్తూ ఆండాళ్ రచించిన 30 పాశురాలను కలిపి తిరుప్పావై అంటారు. ఆళ్వార్ దివ్యప్రబంధంలో తిరుప్పావై ఒక భాగం. తమిళ సాహిత్యంలో దీనికి విశేష ప్రాచుర్యం ఉంది. శ్రీవారి ఆలయంలో నెల రోజులపాటు జరిగే తిరుప్పావై పారాయణంలో రోజుకు ఒకటి వంతున అర్చకులు నివేదిస్తారు. ఈ సందర్భంలో సాధారణంగా భోగశ్రీనివాసమూర్తికి బదులుగా శ్రీకృష్ణస్వామివారికి ఏకాంతసేవ నిర్వహిస్తారు. ఈ తిరుప్పావై పఠనం పూర్తిగా ఏకాంతంగా జరుగుతుంది.
ఏకాంతంగా తోమాల, అర్చన, అర్జిత సేవలు
ధనుర్మాసం సందర్భంగా శ్రీవారి ఆలయంలో నిర్వహించే తోమాల, అర్చన సేవలను కూడా ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. ఈ కారణంగా జనవరి 14వ తేది వరకు తోమాల, అర్చన సేవలకు భక్తులను అనుమతించరు. ఈ సేవలకు సిఫార్సు లేఖలు స్వీకరించబడవు.
వైకుంఠ ద్వార దర్శన రోజుల్లో ఆర్జిత సేవలు రద్దు
డిసెంబర్ 29 నుండి జనవరి 1వ తేది వరకు కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా జనవరి 2వ తేది నుండి 8వ తేది వరకు శ్రీవారి కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, అర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను కూడా ఏకాంతంగా నిర్వహించడం జరుగుతుంది. భక్తులు అనుమతించబడరు.
ఈ మార్పులను భక్తులు గమనించి, టీటీడీ కి సహకరించ వలసిందిగా కోరడమైనది.
No comments :
Write comments