తిరుమల
శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేది వరకు నిర్వహించనున్న ప్రతిష్టాత్మక వైకుంఠ ద్వార దర్శనాలకు విచ్చేసే భక్తులకు స్వామివారి దర్శనాన్ని దివ్య అనుభూతిగా మార్చేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి అన్నారు. తిరుమలలోని ఆస్థాన మండపంలో ఆదివారం సాయంత్రం ఆయన వైకుంఠ ద్వార దర్శనాలకు డిప్యూటేషన్ విధులకు విచ్చేసిన టీటీడీ ఉద్యోగులు, పోలీసులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈసారి వైకుంఠ ద్వార దర్శనాలకు టోకెన్ల కేటాయింపులో విధానాత్మక మార్పులు తీసుకొచ్చినట్లు చెప్పారు. వైకుంఠ ద్వార దర్శన విధులకు వచ్చిన సిబ్బంది వ్యవస్థను పూర్తిగా అర్థం చేసుకుని సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 24 గంటలు అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలన్నారు.
భక్తుల భద్రత, రద్దీ నిర్వహణకు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అత్యాధునిక ఏఐ సాంకేతికత వినియోగిస్తున్నట్లు చెప్పారు. ఈ సాంకేతికత ద్వార భక్తులు, వాహనాల రద్దీపై ప్రత్యక్ష పర్యవేక్షణ కొనసాగుతుందని పేర్కొన్నారు. టీటీడీ, పోలీస్, విజిలెన్స్ విభాగాల నుండి ఐటీ నిపుణులు సమన్వయంతో పని చేస్తూ ఎప్పటికప్పుడు భక్తుల సమాచారాన్ని అప్డేట్ చేస్తూ వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1 లోని ఇంటిగ్రేటెడ్ ఏఐ కమాండ్ కంట్రోల సెంటర్ లో ప్రదర్శించాలని చెప్పారు. భవిష్యత్తులో తిరుమలకు వచ్చే భక్తుల కోసం సమస్య రహిత వ్యవస్థను నిర్మించేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని తెలియజేశారు.
ఈ సమావేశంలో టీటీడీ జేఈవో శ్రీ వీరబ్రహ్మం, సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ, తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ సుబ్బరాయుడు, DFO శ్రీ ఫణికుమార్ నాయుడు ఇతర టీటీడీ ఉన్నతాధికారులు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
No comments :
Write comments