తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా శనివారం రాత్రి 7 గంటలకు గరుడ వాహన సేవ ప్రారంభమైంది. సర్వాలంకార భూషితుడైన గోవిందుడు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో.....
శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం రాత్రి గరుడసేవ అత్యంత వైభవంగా జరిగింది.
గరుడ వాహనం – సర్వపాప ప్రాయశ్చిత్తం
పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజేస్తున్నారు . జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజేస్తారు.
వాహనసేవలో ఆలయ అధికారులు, అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
No comments :
Write comments