టిటిడి
ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్వీ బాలమందిరాన్ని టిటిడి జేఈవో (వైద్యం & విద్య) డా. ఎ. శరత్ గురువారం సంబంధిత అధికారులతో కలిసి సందర్శించి సమగ్రంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అనాథ పిల్లల జీవితాల్లో ఎస్వీ బాలమందిరం ఆశాకిరణంగా నిలుస్తోందన్నారు. పిల్లలతో నేరుగా మాట్లాడిన జేఈవో, టిటిడి అందిస్తున్న నాణ్యమైన విద్య, పౌష్టికాహారం, సదుపాయాలతో కూడిన వసతిని సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థులకు ప్రోత్సాహం అందించారు. విద్య, వైద్యం, ఆహార సదుపాయాలపై ఏవైనా లోపాలు ఉన్నాయా అని ఆరా తీయగా, ఎలాంటి సమస్యలు లేవని విద్యార్థులు సంతృప్తి వ్యక్తం చేశారు.
ఎస్వీ బాలమందిరంలో విద్యనభ్యసించిన పలువురు విద్యార్థులు ఎస్.ఎస్.సి.లో 600 మార్కులకు పైగా 580కు పైగా, ఇంటర్మీడియట్లో 1000 మార్కులకు 982 మార్కులు సాధించి ప్రతిభ చాటిన విషయాన్ని ఏఈవో శ్రీమతి అమ్ములు జేఈవోకు నివేదించారు.
అంతకుముందు వసతి గదులు, వంటగది, భోజనశాలను ఆయన పరిశీలించారు. పిల్లలకు నిర్దిష్ట సమయాలకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం అల్పాహారం, రాత్రి భోజనం అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి రోజు అందించే ఆహార మెనూ, సమయాలను అందరికీ స్పష్టంగా కనిపించేలా ప్రదర్శన బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు.
పిల్లలకు నాణ్యమైన ఆహారం, సమయపాలనతో కూడిన విద్య అందించడంలో ఎలాంటి రాజీ పడకూడదన్నారు. పరిసరాలను మరింత పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఆర్వో ప్లాంట్ ద్వారా తాగునీటి సరఫరా నిరంతరంగా అందేలా మరమ్మత్తులు చేపట్టాలని ఆదేశించారు. విద్యార్థులు ప్రశాంతంగా చదువుకునేందుకు ప్రత్యేక అధ్యయన మందిరం ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని ఇంజినీరింగ్ అధికారులను కోరారు.
ఈ కార్యక్రమంలో టిటిడి డీఈవో శ్రీ వెంకట సునీలు, ఎస్.ఈలు శ్రీ వేంకటేశ్వర్లు, శ్రీ మనోహరం, అదనపు ఆరోగ్యాధికారి డా. సునీల్, డీఈ శ్రీమతి సరస్వతి తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
No comments :
Write comments