టీటీడీ
చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన భక్తులతో మమేకమై టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలపై స్వయంగా అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. మంగళవారం ఉదయం ఆయన తిరుమలలోని సుదర్శన్ సత్రాన్ని తనిఖీ చేసి గదుల్లో వాటర్ లీకేజీని అరికట్టాలని ఆదేశించారు. ఈ భవనాన్ని ఆధునీకరణ లేదా పునర్నిర్మాణం చేసే విధంగా అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలియజేశారు.
ఈ సందర్భంగా సుదర్శన్ సత్రం వద్ద ఉన్న ఫుడ్ కౌంటర్ లో శ్రీవారి సేవకులతో కలిసి భక్తులకు అన్న ప్రసాదాలు వడ్డించారు. అన్న ప్రసాదాల రుచి, నాణ్యత గురించి ఏవిధంగా ఉందని అడగ్గా భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన భక్తులతో కలిసి పక్కనే ఉన్న టీ దుకాణంలో టీ సేవించారు.
అంతకుముందు చైర్మన్ తిరుమలలోని కాకులమానుతిప్ప వద్ద నూతనంగా నిర్మిస్తున్న ఐఓసీఎల్ గ్యాస్ ప్లాంటును తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 5 నెలల ముందు తిరుమలలో ఐఓసీఎల్ ప్లాంటుకు శంకుస్థాపన చేశామని చెప్పారు. మార్చి నెలలో నిర్మాణం పూర్తి చేసి మే నెల నుండి ఈ ప్లాంటు ద్వారా కార్యాకలాపాలు ప్రారంభిస్తామని చెప్పారు.
ఈ ప్లాంటును రోజుకు 40 టన్నుల బయో గ్యాస్ ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా టీటీడీకి సంవత్సరానికి 1.52 కోట్లు ఆదా అవుతుందని, అంతేకాకుండా చెత్తను పునర్వినియోగించడంతో తిరుమల డంపింగ్ యార్డులో చెత్త పేరుకుపోకుండా ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవోలు శ్రీ సోమన్నారాయణ, శ్రీ భాస్కర్, వీజీవో శ్రీ సురేంద్ర, హెల్త్ ఆఫీసర్ శ్రీ మధుసూదన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
No comments :
Write comments