అన్నమయ్య జిల్లా వాల్మీకిపురంలోని శ్రీ పట్టాభిరామ స్వామి వారి ఆలయంలో మార్చి 17న శాస్త్రోక్తంగా ఉదయం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. ఆలయంలో మార్చి 24 నుండి ఏప్రిల్ 02వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్న విషయం విదితమే. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.
ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, సహస్రనామార్చన నిర్వహిస్తారు. అనంతరం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. ఇందులో భాగంగా ఆలయాన్ని శుద్ధి చేసి, పసుపు, కుంకుమ, చందనం, కర్పూరం, కిచిలిగడ్డ, కస్తూరి పసుపు, పచ్చాకు తదితరాలతో తయారుచేసిన సుగంధ మిశ్రమాన్ని గర్భాలయ గోడలకు ప్రోక్షణ చేస్తారు.
మార్చి 23న అంకురార్పణ :
శ్రీ పట్టాభిరామ స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలకు మార్చి 23వ తేదీ రాత్రి 6 నుండి 9 గంటల వరకు ఘనంగా అంకురార్పణ జరుగనుంది. ఈ సందర్భంగా సేనాధిపతి ఉత్సవం, మేదిని పూజ, మృత్సంగ్రహణం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు.
No comments :
Write comments