శ్రీ తాళ్లపాక అన్నమయ్య సంకీర్తనల్లో ఉన్న భావ వైవిధ్యం అపూర్వమని ఎస్వీ యూనివర్సిటీ సంస్కృత విభాగ ఆచార్యులు డా. శిరీష తెలిపారు. భక్తి, శృంగారంతో పాటు నైతిక విలువలను అన్నమయ్య ఎంతో మధురంగా వ్యక్తం చేశారని చెప్పారు.
తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో జరుగుతున్న శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 523వ వర్థంతి ఉత్సవాలు మంగళవారం రెండో రోజుకు చేరుకున్నాయి.
ఈ సందర్భంగా “అన్నమయ్య సంకీర్తనలు - భక్తి, శృంగార నైతిక విలువల సమన్వయం” అనే అంశంపై మాట్లాడిన డా. శిరీష, అన్నమయ్య కీర్తనలలో భక్తి మాత్రమే కాకుండా శృంగార సౌందర్యం, మానవీయ విలువలను కూడా ప్రతిబింబిస్తాయని తెలిపారు. ఆయన పదాల్లో ఆధ్యాత్మికతతో పాటు జీవన సారాంశం దాగి ఉందని చెప్పారు. యువతలో భక్తి, నైతికత పెంపొందించడంలో అన్నమయ్య కీర్తనలు ముఖ్య పాత్ర పోషిస్తాయని అన్నారు.
ఈ కీర్తనలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి దేవస్థానం చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని తెలిపారు.
సదస్సుకు అధ్యక్షత వహించిన ఎస్వీ ప్రాచ్య పరిశోధనా సంస్థ విశ్రాంత ఆచార్యులు ఆచార్య గోవిందరాజు మాట్లాడుతూ, తాళ్లపాక అన్నమయ్యతో పాటు ఆయన వంశీకులు చేసిన సేవలు అమూల్యమని అన్నారు. వారి సాహిత్యం భక్తి, ఆధ్యాత్మికత, సంస్కృతిని కలిపిన గొప్ప సంపదగా నిలిచిందని తెలిపారు. ఈ సాహిత్యాన్ని “ఆంధ్ర వేదం”గా చెప్పవచ్చని పేర్కొన్నారు. భవిష్యత్ తరాలకు ఈ సంపదను అందించడం అవసరమని సూచించారు.
హైదరాబాద్ తెలుగు విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్ డా. విజయ్కుమార్ మాట్లాడుతూ, అన్నమయ్య సంకీర్తనలు భక్తి, శృంగార, ఆధ్యాత్మిక అంశాలతో నిండి ఉన్నాయని చెప్పారు. అన్నమయ్య సాహిత్యానికి ప్రత్యేకమైన శైలి ఉందని, అందులో ఆధ్యాత్మిక జ్ఞానం దాగి ఉందని తెలిపారు. శ్రీనివాసుడు ఎంత మహిమ గల దేవుడో, అన్నమయ్య అంతటి గొప్ప భక్తుడని అన్నారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు శ్రీమతి లత, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.
కార్యక్రమాలు :
అన్నమాచార్య కళామందిరం
సాయంత్రం 6 గంటలకు శ్రీ ఆనందభట్టర్ బృందం సంగీత కార్యక్రమం, రాత్రి 7 గంటలకు శ్రీ వాసవీ కళానికేతన్ బృందం నృత్య కార్యక్రమం నిర్వహించనున్నారు.
మహతి కళాక్షేత్రం
సాయంత్రం 6 గంటలకు శ్రీమతి సుశీల బృందం గాత్ర సంగీతం, రాత్రి 7 గంటలకు శ్రీ జగదీష్ బృందం నృత్య కార్యక్రమం నిర్వహించనున్నారు.
No comments :
Write comments