తిరు
పతి శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన బుధవారం ఉదయం కపిలతీర్థంలోని పుష్కరిణిలో నిర్వహించిన చక్రస్నానం ఎంతో వైభవంగా జరిగింది. ఈ పవిత్ర వేడుకను దర్శించేందుకు విశేష సంఖ్యలో భక్తులు హాజరై పుణ్యస్నానాలు ఆచరించారు. రాత్రి నిర్వహించే ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
ముందుగా ఉదయం 7.30 గంటలకు శ్రీ లక్ష్మణ సమేత సీతారాములవారు పల్లకిలో కపిలతీర్థానికి వేంచేశారు. అనంతరం ఉదయం 9 గంటల నుండి 10.30 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయ మండపంలో స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు.
ఈ సందర్భంగా సీతారామలక్ష్మణులతో పాటు చక్రత్తాళ్వార్లు పాలు, పెరుగు, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంతో అభిషేకాలు స్వీకరించి భక్తులకు కటాక్షం ప్రసాదించారు. అనంతరం అర్చకులు వేదమంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు.
అనంతరం ఉదయం 11 గంటలకు స్వామివారు ఆళ్వార్ తీర్థం నుండి పి.ఆర్. తోటకు వేంచేశారు. సాయంత్రం అక్కడి నుండి బయలుదేరి తీర్థకట్ట వీధి, కోటకొమ్మల వీధి, కొత్తవీధి మీదుగా తిరిగి శ్రీ కోదండరామాలయానికి చేరుకుంటారు. మధ్యలో శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం, శ్రీవైఖానసాచార్యుల ఆలయంలో ఆస్థానం నిర్వహించనున్నారు.
రాత్రి 8.30 నుండి 9.30 గంటల వరకు నిర్వహించే ధ్వజావరోహణ ఉత్సవంతో శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు భక్తి వైభవంగా ముగియనున్నాయి.
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ సురేష్, ఆలయ అర్చకులు మరియు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
No comments :
Write comments