టిటిడి
పంచగవ్య ఉత్పత్తులను మరింతగా పెంచి, భక్తులకు సకాలంలో అందించేలా చర్యలు తీసుకుంటున్నామని టిటిడి జేఈవో (వైద్యం, విద్య) డా. ఎ. శరత్ తెలిపారు. అలిపిరి సమీపంలోని నమామి గోవింద పంచగవ్య ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని ఆయన గురువారం సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ, టిటిడి ఆధ్వర్యంలో దేశీయ ఆవుల మూత్రం, పేడ, పాలు, నెయ్యి, పెరుగుతో సుమారు 15 రకాల పంచగవ్య ఉత్పత్తులను తయారు చేస్తున్నామని చెప్పారు. సహజమైన విధానంలో, భక్తులకు ఉపయోగకరంగా ఉండేలా మరింత నాణ్యమైన ఉత్పత్తులు తయారు చేయడానికి చర్యలు చేపట్టామన్నారు.
పంచగవ్య ఉత్పత్తుల తయారీతో పాటు, ఇండెంట్ ప్రకారం సరఫరా చేయడం మరియు ఉత్పత్తి విస్తరణపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. టిటిడి సమాచార కేంద్రాల ద్వారా ఈ ఉత్పత్తుల అమ్మకాలను మరింత పద్ధతిగా నిర్వహించేందుకు కార్యాచరణ చేపడుతున్నామని తెలిపారు.
నాసల్ డ్రాప్స్, హెర్బల్ ఫ్లోర్ క్లీనర్, నందిని గౌ ఆర్క్, లాగ్స్, చూర్ణం, ధూప్ స్టిక్స్, ధూప్ కోన్స్, విభూది, హెర్బల్ టూత్ పౌడర్, హెర్బల్ ఫేస్ ప్యాక్, హెర్బల్ సోప్, హెర్బల్ షాంపూ వంటి ఉత్పత్తులు తయారు చేస్తున్నామని చెప్పారు. కోయంబత్తూరుకు చెందిన ఆశీర్వాద్ ఆయుర్వేద సంస్థ సాంకేతిక సహకారంతో ఈ పంచగవ్య ఉత్పత్తులను టిటిడి తయారు చేస్తోందని చెప్పారు. పంచగవ్య ఉత్పత్తుల వల్ల కలిగే ప్రయోజనాలపై భక్తులకు అవగాహన కల్పించేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
భక్తులకు ఎక్కువ డిమాండ్ ఉన్న ఉత్పత్తులను గుర్తించి వాటి ఉత్పత్తిని మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ ఉత్పత్తులపై విస్తృత ప్రచారం కూడా చేపడుతున్నామని తెలిపారు.
ఈ సందర్భంగా పంచగవ్య ఉత్పత్తుల తయారీ యూనిట్ను పరిశీలించిన జేఈవో పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో గోశాల డైరెక్టర్ డా. ఎ.వి.ఎన్. శివకుమార్, ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్ డా. రేణు దీక్షిత్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
No comments :
Write comments