తిరుపతి
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మార్చి 19వ తేదీ ఉగాది ఆస్థానం పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం ఉదయం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది.
ఇందులో భాగంగా తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, సహస్రనామార్చన నిర్వహించారు. తరువాత ఉదయం 7 నుండి 9 గంటల వరకు శ్రీ గోవిందరాజస్వామివారి సన్నిధి, శ్రీ పార్థసారథి స్వామివారి సన్నిధి, శ్రీ ఆండాల్ అమ్మవారు, శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి, శ్రీ పుండరికవల్లీ ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం ఉదయం 9.30 గంటల నుండి భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈవో శ్రీ నారాయణ చౌదరి, సూపరింటెండెంట్ శ్రీ చిరంజీవి, అర్చక బృందం పాల్గొన్నారు.
No comments :
Write comments