ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 26న ప్రారంభం కానున్న నేపథ్యంలో భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు, అవసరమైన అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేసేందుకు టిటిడి చర్యలు చేపట్టింది.
టిటిడి ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు, ఈవో శ్రీ ఎం. రవిచంద్ర సూచనల మేరకు టిటిడి జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు టిటిడి ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.
ఈ సందర్భంగా పెండింగ్లో ఉన్న ప్రధాన అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని టిటిడి జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా మసకబారిన వాహనాలకు పాలిషింగ్ చేయడం, అభిషేకం పీఠం, తాండ్లు తదితర వస్తువులకు బ్రాస్ లైనింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే గజ వాహనానికి అవసరమైన మరమ్మత్తులు చేపట్టాలని అధికారులకు తెలిపారు.
ఈసారి వేసవి తీవ్రత అధికంగా ఉండనున్న నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా ఆలయం చుట్టుపక్కల వీధుల్లో కూల్ పెయింటింగ్ వేయాలని సూచించారు. అలాగే భక్తులకు తాగునీటి సౌకర్యం మెరుగుపరచేందుకు ఆర్.ఓ. వాటర్ ప్లాంట్లు మరియు కూలర్ల నిర్వహణ పనులు చేపట్టాలని తెలిపారు.
ఆలయం పరిసర ప్రాంతాల్లో ఉన్న వాష్రూమ్స్ / టాయిలెట్స్లో అవసరమైన ట్యాపులు, తలుపులు, కమోడ్లకు మరమ్మత్తులు వెంటనే చేపట్టాలని అధికారులకు సూచించారు.
అలాగే యాగశాలను అందంగా, శాస్త్రీయంగా ఉండే విధంగా అభివృద్ధి చేయాలని కోరారు. బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందే అన్ని అభివృద్ధి పనులను పూర్తి చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని టిటిడి జేఈవో అధికారులను ఆదేశించారు.
No comments :
Write comments