ఒంటిమిట్టలోని
పవిత్రక్షేత్రమైన శ్రీ కోదండరామస్వామి ఆలయంలో జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల హృదయాలను పరవశింపజేసేలా టిటిడి అత్యంత వైభవంగా విద్యుత్ అలంకరణలను చేపట్టింది. వెన్నెలను తలపించే వెలుగుల మధ్య ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక ఆనందాన్ని ప్రసరింపజేస్తూ భక్తులకు దివ్యానుభూతిని అందిస్తున్నాయి.
ఒంటిమిట్ట ఆలయం లోపల మరియు వెలుపల ప్రాంతాలు, పరిసర ప్రాంతాలు, టిటిడి భవనం, వాహన మండపం, ఆలయం ముందు గార్డెన్, ప్రధాన కూడళ్లు, అలాగే ఒంటిమిట్ట నుండి మాధవవరం వరకు మార్గమంతా విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. నాలుగు మాడ వీధులు, పుష్కరిణి, పార్కింగ్ ప్రాంతం, ఒంటిమిట్ట పరిసర ప్రాంతాలు, కల్యాణ వేదిక తదితర ప్రాంతాలు రాత్రివేళల్లో రజత కాంతులతో మెరిసిపోతూ బ్రహ్మోత్సవాలకు అపూర్వమైన శోభను చేకూర్చుతున్నాయి.
బ్రహ్మోత్సవాల సందర్భంగా 30కి పైగా దేవతామూర్తుల పెద్ద బొమ్మలు, 70కు పైగా ప్రత్యేక డిజైన్ బోర్డులు, అలాగే అనేక అద్భుత ఇల్యూమినేషన్ బోర్డులను ఏర్పాటు చేశారు. దేవాతామూర్తుల పెద్ద బొమ్మలలో శ్రీరామ పట్టాభిషేకం, శ్రీరామ కల్యాణం, అయోధ్య రాముడు, రామబాణం, ఏనుగు మీద శ్రీవారు, గరుత్మంతుడిపై శ్రీవారు, శ్రీ పద్మనాభ స్వామి, అమ్మవారి త్రీడీ రూపం, శ్రీరాముడు – శబరి, దశావతారాలు, అష్టలక్ష్ములు వంటి దివ్యరూపాలు విద్యుత్ కాంతుల్లో ప్రకాశిస్తూ భక్తులకు ఆధ్యాత్మిక సౌందర్యాన్ని పంచనున్నాయి.
అదేవిధంగా 20 వేల సీరియల్ లైట్స్, 10 వేల ఫ్లడ్ లైట్లు, 500 రంగు రంగుల లైట్లు, 40 జనరేటర్లు, వివిధ రకాల తోరణాలతో ఒంటిమిట్ట అంతా ప్రకాశవంతంగా మారి బ్రహ్మోత్సవాల వైభవాన్ని మరింత పెంచనున్నాయి.
ప్రత్యేక ఆకర్షణగా కల్యాణ వేదిక
ఏప్రిల్ 1న నిర్వహించనున్న శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని వీక్షించేందుకు వేలాది మంది భక్తులు తరలి రానున్నారు. వారి సౌకర్యార్థం కల్యాణ వేదిక పరిసరాలు, వాహనాల పార్కింగ్ ప్రాంతం మరియు ఆలయ పరిసరాల్లో 24 ఎల్.ఈ.డి వీడియో డిస్ప్లే బోర్డులను ఏర్పాటు చేస్తున్నారు. వీటి ద్వారా భక్తులు ఎక్కడి నుంచైనా శ్రీ సీతారాముల దివ్య కల్యాణాన్ని కనులారా వీక్షిస్తూ భక్తి పరవశంలో తేలియాడేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
No comments :
Write comments