ఒంటిమిట్టలోని శ్రీ ఆంజనేయస్వామివారు సంజీవరాయుడిగా భక్తులకు దర్శనమిస్తూ కరుణాకటాక్షాలు ప్రసాదిస్తున్నారు. విశిష్టమైన పురాణ ప్రాశస్త్యం కలిగిన ఈ క్షేత్రంలో సంజీవరాయుడిగా పేరొందిన స్వామివారు భక్తులకు ఆశ్రయదైవంగా వెలుగొందుతున్నారు.
ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో సీతాదేవి, లక్ష్మణస్వాములు ఇరువైపులా ఉండగా కోదండం ధరించిన శ్రీరామచంద్రుడు దర్శనమిస్తారు. ఇది అరణ్యవాస కాలం నాటి దృశ్యాన్ని సూచిస్తుంది. అప్పటికి హనుమంతునికి శ్రీరాముని దర్శనం కలగలేదని పురాణాలు చెబుతున్నాయి. అందువల్లనే ఒంటిమిట్ట కోదండరామాలయంలో ఆంజనేయస్వామి విగ్రహం లేదని అంటారు.
రామాలయం అంటే భూమికి దిగిన వైకుంఠమని, రాముని బంటునిగా తన ప్రభువుకు ఎదురుగా నిలబడి సేవ చేయాలనే సంకల్పంతో ఆంజనేయస్వామి ఉన్నారని పురాణ కథనాలు తెలియజేస్తున్నాయి. అందువల్లనే ఒంటిమిట్ట రామాలయానికి ఎదురుగా ఆంజనేయస్వామి సంజీవరాయుడిగా కొలువుదీరి భక్తులను అనుగ్రహిస్తున్నారు.
రామరావణ యుద్ధ సమయంలో వానరసైన్యం మరణించినప్పుడు, అలాగే లక్ష్మణుడు మూర్చపోయిన సందర్భంలో ఆంజనేయస్వామి హిమాలయ పర్వతాలను దాటి మహేంద్రగిరికి వెళ్లి నాలుగు రకాల సంజీవని మూలికలను తెచ్చినట్టు పురాణాల్లో వివరించబడింది. అందుకే ఇక్కడి స్వామివారిని సంజీవరాయుడు అని పిలుస్తారు.
అదేవిధంగా చెరువు కట్టపై కూడా శ్రీ ఆంజనేయస్వామివారు కొలువై భక్తులను కాపాడుతున్నారని విశ్వసిస్తారు. నీటి ప్రాంతాల్లో గానీ, వరిపొలాల్లో గానీ ఈ మార్గంలో సంచరించే వారికి ఎలాంటి ప్రాణాపాయం కలగకుండా స్వామివారు రక్షిస్తారని భక్తుల నమ్మకం. శారీరక, మానసిక వ్యాధులను తొలగిస్తూ సంజీవరాయుడు భక్తులకు కరుణాకటాక్షాలు ప్రసాదిస్తారని స్థానికులు విశ్వసిస్తున్నారు.
No comments :
Write comments