సంకీర్తనలతో శ్రీవారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసిన పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులవారి 618వ జయంతి ఉత్సవాలు మే 2 నుండి 8వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. అన్నమయ్య జన్మస్థలమైన తాళ్లపాకలోని ధ్యానమందిరం, రాజంపేటలోని 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద, తిరుపతిలోని మహతి కళాక్షేత్రం, అన్నమాచార్య కళామందిరంలలో జయంతి కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
తాళ్లపాకలో..
తాళ్లపాకలోని ధ్యానమందిరంలో మే 2వ తేదీన ఉదయం 9 గంటలకు కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. మొదటగా అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు మరియు స్థానిక కళాకారులచే సప్తగిరి సంకీర్తన గోష్ఠిగానం నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు శ్రీవారి కల్యాణం కన్నుల పండుగగా జరుగనుంది.
ఇందులో భాగంగా మే 2 నుండి 8వ తేదీ వరకు ప్రతి రోజు సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు గాత్ర సంగీతం, హరికథ, నృత్య, నాటక ప్రదర్శన కార్యక్రమాలు జరుగనున్నాయి.
రాజంపేటలోని 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద మే 2వ తేదీ సాయంత్రం 6.30 గంటలకు ఊంజల్ సేవ జరుగనుంది. అదేవిధంగా మే 2 నుండి 8వ తేదీ వరకు సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు సంగీత, వాద్య, హరికథ కార్యక్రమాలు జరుగనున్నాయి.
తిరుపతిలో..
తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో మే 2వ తేదీ ఉదయం 9 గంటలకు సప్తగిరి సంకీర్తన గోష్ఠిగానంతో జయంతి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఉదయం 10 నుండి 11.30 గంటల వరకు సంగీత సభ, ఉదయం 11.30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు హరికథ గానం జరుగనుంది.
మే 3 నుండి 7వ తేదీ వరకు ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు సాహిత్య సదస్సులు జరుగనున్నాయి. మే 8వ తేదీ ఉదయం 8 గంటలకు శ్రీ కోదండరామస్వామివారి ఆస్థానం నిర్వహించనున్నారు. ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు సంగీత సభ, హరికథ గానం జరుగనుంది.
ఇందులో భాగంగా మే 2 నుండి 8వ తేదీ వరకు ప్రతి రోజు సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు గాత్ర సంగీతం, నృత్య, వాద్య, హరికథ కార్యక్రమాలు జరుగనున్నాయి.
మహతి కళాక్షేత్రంలోనూ మే 2 నుండి 8వ తేదీ వరకు సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు సంగీత, నృత్య, వాద్య కార్యక్రమాలు జరుగనున్నాయి.
భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నమయ్య సంకీర్తనల సౌరభాన్ని ఆస్వాదించాలని టిటిడి విజ్ఞప్తి చేస్తోంది.
No comments :
Write comments