ఒంటిమిట్ట
శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం నిర్వహించిన శ్రీ సీతారాముల కల్యాణాన్ని వీక్షించేందుకు విచ్చేసిన వేలాది మంది భక్తులకు శ్రీవారి సేవకులు అత్యంత క్రమశిక్షణతో, భక్తి శ్రద్ధలతో విశేష సేవలందించారు.
టీటీడీ చైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు, ఈవో శ్రీ ఎం. రవిచంద్ర ఆదేశాల మేరకు, జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం పర్యవేక్షణలో, సిపిఆర్ఓ డా. టి. రవి, పిఆర్ఓ (ఎఫ్ఏసీ) కుమారి నీలిమ ఆధ్వర్యంలో కడప పరిసర ప్రాంతాల నుండి వచ్చిన సుమారు 2,600 మంది శ్రీవారి సేవకులు వివిధ విభాగాల్లో భక్తులకు సేవలందించారు. కల్యాణ వేదిక పరిసరాల్లో అన్నప్రసాదం, ఆరోగ్య, విజిలెన్స్ విభాగాలతో సమన్వయం చేసుకుంటూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సేవలను సమర్థవంతంగా నిర్వహించారు.
భక్తులకు అవసరమైన సదుపాయాలు :
బుధవారం సాయంత్రం నుండి గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తులకు తాగునీరు, మజ్జిగ, ఫ్రూటీ, అన్నప్రసాదాలు సమృద్ధిగా అందించారు. అదేవిధంగా శ్రీవారి లడ్డూ, ముత్యాల తలంబ్రాలు, కంకణాలు కలిగిన బ్యాగులను భక్తిశ్రద్ధలతో పంపిణీ చేశారు.
భక్తులు సులభంగా గ్యాలరీలలోకి ప్రవేశించి దర్శనం చేసుకునేలా మాడ వీధుల్లో ప్రవేశ, నిష్క్రమణ ద్వారాల వద్ద మరియు గ్యాలరీలలో రద్దీని క్రమబద్ధీకరించడంలో టిటిడి అధికారులకు సేవకులు సహకారం అందించారు.
తిరునామధారణ సేవలు :
శ్రీ సీతారాముల కల్యాణానికి విచ్చేసిన భక్తులకు శ్రీవారి సేవకులు తిరునామధారణ సేవలు అందించి ఆధ్యాత్మిక భావాన్ని మరింత పెంపొందించారు. సీతారాముల కళ్యాణం సందర్భంగా టీటీడీ చేపట్టిన ఏర్పాట్లపై భక్తుల నుండి అభిప్రాయాలు సేకరించారు.
ముత్యాల తలంబ్రాల ప్యాకింగ్ :
శ్రీవారి సేవకులు 1.60 లక్షల ముత్యాల తలంబ్రాలను అత్యంత భక్తి భావంతో ప్యాక్ చేశారు.
భక్తులకు శ్రీవారి లడ్డూ ప్రసాదం :
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం నుండి తీసుకువచ్చిన సుమారు 85 వేల శ్రీవారి లడ్డూలను కల్యాణానికి విచ్చేసిన భక్తులకు పంపిణీ చేశారు.
అన్నప్రసాదాల విరివిగా పంపిణీ
టీటీడీ అన్నప్రసాద విభాగం ఆధ్వర్యంలో సుమారు 85 వేల పులిహోర, 85 వేల కేసరి, బాదుషా, మిక్చర్, బిస్కెట్ ప్యాకెట్లను భక్తులకు అందజేశారు.
శ్రీవారి సేవకులు అందించిన సేవల పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేసి అభినందనలు తెలిపారు. భక్తుల సేవే భగవంతుని సేవ అనే భావంతో సేవకులు నిరంతరం సేవలందించడం విశేషం.
No comments :
Write comments