ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల, సహస్రనామార్చన సేవలు నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం సేనాధిపతి ఉత్సవం, గంగుండ్ర మండపంలో ఆస్థానం, యాగశాలలో శాస్త్రోక్త అంకురార్పణ కార్యక్రమాలు జరుగుతాయి.
ఆలయప్రాశస్త్యం
కలియుగ వైకుంఠమైన తిరుపతిలో వెలసిన శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయం భక్తి, చరిత్ర, శిల్పకళ, ఆగమ సంప్రదాయాల సమ్మేళనంగా యుగయుగాలుగా భక్తులను ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తోంది. ఈ దివ్యక్షేత్రాన్ని దర్శించుకున్న భక్తులకు రుణ విమోచనం, మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక ఆనందం కలుగుతాయని స్థల పురాణం పేర్కొంటోంది. స్వామివారి దివ్య మంగళ విగ్రహం భక్తుల హృదయాలలో విశ్వాసాన్ని నింపుతూ, జీవన సాఫల్యానికి మార్గదర్శకంగా నిలుస్తోంది.
స్థలపురాణవైభవం
పురాణాల ప్రకారం, శ్రీ మహావిష్ణువు భూలోకంలో శ్రీనివాసుడిగా అవతరించి తిరుమలలో నివసించే సమయంలో వివాహ మహోత్సవం నిమిత్తం కుబేరుని వద్ద నుండి ధనం అప్పుగా తీసుకున్నారని విశ్వసిస్తారు. ఆ ధనాన్ని కొలిచే బాధ్యతను శ్రీనివాసుడి అన్నయ్య అయిన శ్రీ గోవిందరాజ స్వామివారికి అప్పగించారని స్థల పురాణం తెలియజేస్తోంది. ధనాన్ని కొలుస్తూ అలసిన స్వామివారు ఆదిశేషునిపై శయనించిన దివ్య రూపమే నేటి శ్రీ గోవిందరాజ స్వామివారి దర్శనమని భక్తుల విశ్వాసం.
గర్భాలయంలోదివ్యదర్శనం
ఆదిశేషునిపై శయనిస్తున్న స్వామివారు గర్భాలయంలో దివ్య కాంతులతో దర్శనమిస్తూ భక్తుల హృదయాలకు ప్రశాంతతను ప్రసాదిస్తున్నారు. స్వామివారి నాభి నుండి బ్రహ్మదేవుడు ఉద్భవించినట్లు, పాదాల వద్ద శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు, మోక్షం కోసం తపస్సు చేస్తున్న మధు–కైటభ రాక్షసులు కొలువై ఉన్న దృశ్యం భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తుతోంది.
దర్శనం – నిత్యసేవలు
ప్రతిరోజూ ఉదయం 5 గంటలకు సుప్రభాతంతో స్వామివారి సేవలు ప్రారంభమవుతాయి. ఉదయం 5.30 గంటలకు విశ్వరూప దర్శనం, 6.30 గంటలకు తోమాల సేవ, 7.30 గంటలకు అర్చన, 8 గంటలకు అర్చనానంతర దర్శనం నిర్వహిస్తారు. రాత్రి 8.30 గంటలకు ఏకాంత సేవతో నిత్య కార్యక్రమాలు ముగుస్తాయి. ఈ సేవల్లో పాల్గొనే భక్తులు అపార ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతున్నారు.
భక్తులకుఉచితఅన్నప్రసాదాలు
శ్రీ గోవిందరాజ స్వామివారిని దర్శించుకునే భక్తులకు ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు చక్కెర పొంగలి, అన్నం, సాంబారు, రసం, కర్రీ, చట్నీ, మజ్జిగతో రుచికరమైన భోజనం వడ్డిస్తున్నారు.
అదేవిధంగా, ఆలయం సమీపంలోని పాత మ్యూజియంలో ప్రతిరోజూ ఉచిత అన్నప్రసాదాలను అందిస్తున్నారు.
2026 ఫిబ్రవరి నెల నుండి సాయంత్రం 6.30 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు సాంబారు అన్నం, పెరుగు అన్నం కూడా పంపిణీ చేస్తున్నారు.
రాజగోపురశిల్పవైభవం
ఆలయంలోకి ప్రవేశించగానే దర్శనమిచ్చే ఏడు అంతస్తుల మహారాజగోపురం విజయనగర శిల్పకళా వైభవానికి ప్రతీకగా నిలుస్తోంది. స్థానిక పాలకుడు మట్ల అనంతరాజు నిర్మించిన ఈ గోపురం ద్రావిడ, విజయనగర నిర్మాణ శైలుల సమ్మేళనంగా శతాబ్దాలుగా భక్తులను ఆకట్టుకుంటోంది.
మూడు అంతస్తులతో నిర్మించిన పడి కావిలి గోపురం, మహాద్వార గోపురం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుండగా, విమాన గోపురం బంగారు తాపడంతో దివ్య కాంతులను విరజిమ్ముతోంది.
బంగారుతాపడం – మహాసంప్రోక్షణ
ఆలయంలో 70 సంవత్సరాల క్రితం ప్రతిష్టించిన పాత ధ్వజస్తంభం స్థానంలో 2018 ఏప్రిల్ 7న నూతన ధ్వజస్తంభాన్ని ప్రతిష్టించారు. అనంతరం 2018 ఏప్రిల్ 12న వైఖానస ఆగమోక్తంగా మహాసంప్రోక్షణ నిర్వహించారు.
ఆలయ విమాన గోపురానికి 100 కిలోల బంగారంతో తాపడం పనులను 2021 సెప్టెంబర్ 14న ప్రారంభించి, 2023 మే 25న బంగారు తాపడం విమాన గోపుర మహాసంప్రోక్షణను అత్యంత వైభవంగా నిర్వహించారు.
క్షేత్రవైభవం
ఈ మహాక్షేత్రంలో శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి స్థానక రూపంలో, శ్రీ పార్థసారథి స్వామివారు ఆసీన రూపంలో, శ్రీ గోవిందరాజ స్వామివారు శయన రూపంలో దర్శనమిస్తారు. ఒకే ప్రాంగణంలో నిల్చున్న, కూర్చున్న, శయనించిన విష్ణుమూర్తుల సన్నిధులు దర్శనమివ్వడం ప్రపంచంలోనే అరుదైన విశేషంగా భావించబడుతోంది.
ఉపఆలయాలు – ఆధ్యాత్మికసంపద
ఆలయ ప్రాంగణంలో వెలసిన శ్రీ ఆండాళ్ అమ్మవారు, శ్రీ పుండరీకవల్లి అమ్మవారు, సుదర్శన చక్రత్తాళ్వార్ సన్నిధి, భగవద్రామానుజాచార్యులు, తిరుమలనంబి, అనంతాళ్వారుల సన్నిధులు భక్తులకు మరింత ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తున్నాయి. వైష్ణవ సంప్రదాయానికి ప్రతీకలుగా ఈ దివ్య సన్నిధులు తరతరాలకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి.
భగవద్రామానుజాచార్యుల ఆదేశాల మేరకు తిరుమల తరహాలో శ్రీ గోవిందరాజ స్వామివారికి నిత్య, వార, పక్ష, మాస, సంవత్సరోత్సవాలను టీటీడీ అత్యంత వైభవంగా నిర్వహిస్తోంది. వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవాలు, మాఘమాసంలో తెప్పోత్సవాలు, చైత్రమాసంలో వసంతోత్సవాలు, అశ్వయుజమాసంలో పవిత్రోత్సవాలు, జ్యేష్ఠాభిషేకం, పుష్పయాగం, పొన్నకాల్వ ఉత్సవం విశేషంగా జరుగుతాయి.
ప్రతి పౌర్ణమికి గరుడసేవ, మూలమూర్తికి పూలంగి సేవ భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తుతున్నాయి.
ప్రసాదాలమాధుర్యం
ప్రతిరోజూ భక్తులకు పొంగలి, పులిహోర, పెరుగన్నం, దోసెలను నైవేద్య ప్రసాదాలుగా అందిస్తున్నారు. ప్రత్యేక పర్వదినాల్లో చక్కెర పొంగలి, సీరా, క్షీరాన్నం, బెల్లం దోశ, అప్పం, లడ్డూ ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేస్తున్నారు.
జీయర్వ్యవస్థవైభవం
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంతో పాటు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ కైంకర్యాలను పర్యవేక్షించేందుకు ఉత్తర మాడ వీధిలో పెద్ద జీయర్ మఠం, సన్నిధి వీధిలో చిన్న జీయర్ మఠాన్ని భగవద్రామానుజాచార్యులు ఏర్పాటు చేశారు.
పుష్కరిణిఆధ్యాత్మికకాంతి
ఆలయానికి ఎదురుగా సుమారు 2.5 ఎకరాల విస్తీర్ణంలో వెలసిన స్వామివారి పుష్కరిణి ఆధ్యాత్మిక కాంతిని విరజిమ్ముతోంది. ప్రతిరోజూ టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహించే భక్తి, ఆధ్యాత్మిక, సంగీత కార్యక్రమాలు భక్తులను ఆహ్లాదపరుస్తున్నాయి.
ప్రతి ఏడాది నిర్వహించే ఏడు రోజుల తెప్పోత్సవాలు వేలాది మంది భక్తులను ఆకర్షిస్తుంటాయి. పుష్కరిణిలో అలంకరించిన తెప్పపై స్వామివారి విహారం దర్శించుకోవడం భక్తులకు అరుదైన ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తోంది.
రామాయణం, మహాభారతం, భాగవత ఘట్టాలతో, శిల్పకళా సంపదతో, వైష్ణవ సంప్రదాయ మహిమతో వెలసిన ఈ మహాక్షేత్రం తిరుపతి ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రపంచానికి చాటిచెబుతోంది.
No comments :
Write comments