23.5.26

వేదఘోషల నడుమ వైభవంగా గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ brahmotsavams







తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో తొమ్మిది రోజులపాటు నిర్వహించనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు శుక్రవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఆల వేదఘోషలు, మంగళవాయిద్యాలు, వైదిక మంత్రోచ్ఛారణల నడుమ నిర్వహించిన పవిత్ర కార్యక్రమం భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ముంచెత్తింది.


ఉదయం సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి తోమాల, సహస్రనామార్చన సేవలను నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో సేనాధిపతి త్సవం, ముఖ మండపంలో వేంచేపు, సమర్పణ, ఆస్థానం తదితర వైదిక కార్యక్రమాలను వైభవంగా చేపట్టారు. యాగశాలలో ప్రత్యేక పూజల అనంతరం అంకురార్పణం శాస్త్రోక్తంగా నిర్వహించారు.


బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు


శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో టిటిడి విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. వేసవి నేపథ్యంలో చలువ పందిళ్లు, వైట్ పెయింట్, ఆలయం పరిసరాలలో ఆకట్టుకునేలా రంగోలీలు, విద్యుత్ అలంకరణలు, పెయింటింగ్స్, పుష్పలంకరణలు తదితర ఏర్పాట్లు చేపట్టారు.


మే 23 ధ్వజారోహణం


బ్రహ్మోత్సవాల తొలి రోజు అయిన మే 23 ఉదయం 07.35 గంటల నుండి 08.49 గంటల మధ్య మిథున లగ్నంలో ధ్వజారోహణ మహోత్సవం నిర్వహించనున్నారు. ఉదయం సుప్రభాతం, ఆలయ శుద్ధి, తోమాల సేవ, అర్చన సేవల అనంతరం ధ్వజస్తంభానికి తిరుమంజనం, పూజలు, ధ్వజారోహణ కార్యక్రమాలు జరుగనున్నాయి.


తదుపరి ఉదయం 10 గంటలకు స్నపన తిరుమంజనం, శుద్ధి, సేవాకాలం, శాత్తుమొర, ఆస్థానం నిర్వహిస్తారు. రాత్రి 7 గంటలకు పెద్దశేష వాహనంపై స్వామివారు తిరువీధుల్లో విహరించి భక్తులకు దివ్య దర్శనం ప్రసాదించనున్నారు.


ప్రతిరోజూ ఉదయం 7 నుండి 9 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు నిర్వహించనున్న వాహనసేవలు భక్తులకు అపూర్వ ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించనున్నాయి. ముఖ్యంగా మే 27 గరుడవాహన సేవ, మే 30 రథోత్సవం బ్రహ్మోత్సవాల ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయి.


వాహనసేవల వివరాలు

24.05.2026 – ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి హంస వాహనం

25.05.2026 – ఉదయం సింహ వాహనం, రాత్రి ముత్యపుపందిరి వాహనం

26.05.2026 – ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి సర్వభూపాల వాహనం

27.05.2026 – ఉదయం మోహినీ అవతారం, రాత్రి రుడ వాహనం

28.05.2026 – ఉదయం హనుమంత వాహనం, రాత్రి గజ వాహనం

29.05.2026 – ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం

30.05.2026 – ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వవాహనం

31.05.2026 – ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణం


బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్ట్, దాస సాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ప్రతిరోజూ భక్తి సంగీత, ఆధ్యాత్మి, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.


కార్యక్రమంలో శ్రీ శ్రీ శ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీ శ్రీ శ్రీ చిన్న జీయర్ స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి వి.ఆర్. శాంతి, ఏఈవో శ్రీ ఏబీ నారాయణ చౌదరి, సూపరింటెండెంట్లు శ్రీ శేషగిరి, శ్రీ చిరంజీవి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ ధనుంజయరావు, అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments