ఇటీవల కొన్ని పత్రికలు, సోషల్ మీడియా వేదికల్లో శ్రీవాణి ట్రస్టు టికెట్ల బుకింగ్కు సంబంధించి వస్తున్న వార్తల నేపథ్యంలో భక్తులు అపోహలకు గురికావద్దని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
టీటీడీ శ్రీవాణి ట్రస్టు టికెట్ల బుకింగ్ విధానాన్ని 2019 మే నెలలో ప్రవేశపెట్టింది. అప్పటి నుండి భక్తులు మధ్యవర్తుల ద్వారా టికెట్లు బుక్ చేసుకోవడం జరుగుతోంది.
అందులోని లోటుపాట్లను మరియు భక్తుల నుండి వచ్చిన సూచనలు, సలహాల మేరకు 2024 సంవత్సరం జూన్ నుండి భక్తులకు పారదర్శకంగా, సురక్షితంగా సేవలు అందించేందుకు శ్రీవాణి టికెట్ బుకింగ్ విధానాన్ని అత్యంత పటిష్టంగా రూపొందించడం జరిగింది.
శ్రీవాణి టికెట్ బుకింగ్ సైట్ను హ్యాక్ చేయడం లేదా వ్యవస్థలో చొరబడటం ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదు. భక్తులు అపోహలకు గురి కావద్దు. అయితే కొందరు దళారులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తూ ఏఐ ఆధారిత ఆటో ఫిల్లింగ్, ఆటో కాపీయింగ్ వంటి పద్ధతుల ద్వారా వేగంగా వివరాలు నమోదు చేసి టికెట్లను బుక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
ఇలాంటి అనుమానాస్పద కార్యకలాపాలను టీటీడీ సాంకేతిక విభాగం ఎప్పటికప్పుడు గుర్తించి సంబంధిత ఐడీలు మరియు అక్రమ బుకింగ్ విధానాలను వెంటనే నిరోధించి తదనుగుణంగా సాప్ట్ వేర్ ను కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ నిరంతర నిఘా ఉంచడం జరుగుతోంది.
అదేవిధంగా కొంతమంది దళారులు భక్తులను తప్పుదోవ పట్టించి నకిలీ టికెట్లను విక్రయిస్తున్న నిందితులపై కూడా టీటీడీ కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతోంది.
అదేవిధంగా అడ్వాన్స్ బుకింగ్ సాప్ట్ వేర్ ను ముందు వచ్చిన వారికి ముందు బుక్ చేసుకునే విధానంలో అభివృద్ధి చేయడం జరిగింది. బుకింగ్ సమయంలో ఏదైనా కారణంగా టికెట్ బుక్ కాకపోయినా లేదా నగదు చెల్లింపులో లోపం తలెత్తితే వెంటనే ఆ టికెట్లు భక్తులకు అందుబాటులోకి వచ్చేలా ఈ అప్లికేషన్ పని చేస్తోంది.
భక్తులు కేవలం అధికారిక టీటీడీ వెబ్సైట్ మరియు అధికారిక మార్గాల ద్వారానే టికెట్లు బుక్ చేసుకోవాలని, దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.
No comments :
Write comments