17.6.26

శ్రీలక్ష్మీనారాయణ సన్నిధిలో వైభవంగా శ్రీ పెరియాళ్వార్ ఉత్సవాలు ప్రారంభం sri periyalvar utsavas


తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీలక్ష్మీనారాయణస్వామి వారి ఆలయంలో శ్రీ వైష్ణవ సంప్రదాయ మహామహుడు, శ్రీమహావిష్ణువు పరమభక్తుడు అయిన శ్రీ పెరియాళ్వార్ ఉత్సవాలు మంగళవారం అత్యంత వైభవంగా ఆరంభమయ్యాయి. ఉత్సవాలు జూన్ 25 తేదీ వరకు క్తిశ్రద్ధలతో కొనసాగనున్నాయి.


ఉత్సవాల్లో భాగంగా ఉదయం, సాయంత్రం శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి తమ శిష్యబృందంతో కలిసి శ్రీ పెరియాళ్వార్ సన్నిధిలో దివ్యప్రబంధ పాశురాలను భక్తిపూర్వకంగా నివేదించి ఆధ్యాత్మిక సౌరభాన్ని వెదజల్లారు.


శ్రీమహావిష్ణువు అనుగ్రహాన్ని పొందిన మహాభాగవతుడు, శ్రీ ఆండాళ్ అమ్మవారి తండ్రి అయిన శ్రీ పెరియాళ్వార్ తులసీమాలలను స్వయంగా తయారు చేసి ప్రతిరోజూ స్వామివారికి సమర్పించేవారని, ఆయన రచించిన పాశురాలు నేటికీ వైష్ణవ సంప్రదాయానికి ఆధ్యాత్మిక మార్గదర్శకంగా నిలిచాయని అర్చకులు వివరించారు.


ఉత్సవాల చివరి రోజైన జూన్ 25న ఉదయం శ్రీ పెరియాళ్వార్‌కు తిరుమంజనం నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం శ్రీ గోవిందరాజస్వామివారు గరుడవాహనంపై, శ్రీ పెరియాళ్వార్ గజవాహనంపై ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దివ్యమంగళ దర్శనం ప్రసాదించనున్నారు.


ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ శ్రీ చిరంజీవి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ ధనుంజయ, ఇతర అధికారులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.


No comments :
Write comments